Hyderabad Weather News : మూడు నాలుగేళ్లుగా.. మార్చి కంటే ముందే ఎండలు మండిపోతున్నాయ్. సంక్రాంతి వెళ్లడమే ఆలస్యం.. మండుటెండలు మాడు పగిలేలా కాస్తున్నాయ్. ఉదయం, సాయంత్రం కాస్త చల్లబడినా.. సరిగ్గా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సమయాల్లో మాత్రం.. ముఖం మాడిపోయేలా ఎండలు కాస్తున్నాయి. శివరాత్రికి.. శివ శివ అంటూ చలికాలం వెళ్లిపోతుందన్నది నానుడి. కానీ.. సంక్రాంతి నుంచే ఠారెత్తించే ఎండలు అడుగు బయటపెట్టాలంటేనే బెంబేలెత్తిస్తున్నాయి.
ఇప్పుడైతే ఎండలు మరింత పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల మేర పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఎండలు మండిపోతాయని పేర్కొంది. ఫిబ్రవరి కంటే మార్చిలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. మార్చి మొదటివారంలో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
Read More : సమ్మర్.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి!
ఫిబ్రవరిలో మాదిరి.. మార్చి 5 వరకూ కాస్త పొగమంచు, ఆకాశం మేఘావృతమై కనిపించినా ఆ తర్వాత మాత్రం ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను తాకుతాయని అంచనా వేశారు. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉక్కపోత విపరీతంగా ఉండే అవకాశాలు లేకపోలేదని ఐఎండీ వెల్లడించింది. ఎండలు మండిపోతుండటంతో ఇప్పటి నుంచే ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉండటంతో.. ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.
వేసవిలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వేడిగాలులు, తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అనవసరంగా బయటకు వెళ్లరాదు. నీరు ఎక్కువగా తాగాలి. అలాగే శరీరానికి చలువ చేసే.. కొబ్బరినీళ్లు, సబ్జా వాటర్, మజ్జిగ వంటివి తాగుతుండాలి. పుచ్చకాయ, కమల, బత్తాయి, గ్రేప్స్ వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినాలి. పిల్లలకు కూడా వీటిని ఎక్కువగా పెట్టడం మంచిది. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతాయి. కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్ వంటి వాటికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.
మట్టికుండలో ఉంచిన నీటిని తాగితే శరీరానికి చాలా మంచిది. ఉదయం 9 గంటల తర్వాతి నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పిల్లలు, వృద్ధులు నీడపట్టునే ఉండటం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండలో బయటకు వెళ్లేటపుడు లేతరంగు దుస్తులు ధరించాలి. ముఖానికి తెలుపు, పలుచని దుస్తులతో కప్పుకోవాలి. కళ్లకు కూలింగ్ గ్లాసులు పెట్టుకోండి. చర్మానికి ఎస్ పీఎఫ్ 15 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ను వాడండి. రోజులో ముఖాన్ని 4- 5 సార్లు శుభ్రం చేయండి. వీలైనంత వరకూ నేచురల్ ఫేస్ ప్యాక్స్ ను వాడండి.