Sandeshkhali case updates(Telugu breaking news): సందేశ్ఖాలీ కేసులో టీఎంసీ నేతను ఎట్టికేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.షేక్ షాజహాన్ను నార్త్ 24 పరగణాల జిల్లాలోని మినాఖా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఓ ఇంటిలో ఉండగా అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతంలో కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులను చిత్రహింసలకు గురిచేశారని షేక్ షాజహాన్ పై ఆరోపణలు వచ్చాయి. సందేశ్ఖాలీలో మహిళలపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడ్డారని ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయన భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గురువారం ఉదయం తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్థానిక కోర్టులో అతడిని ప్రవేశపెట్టారు. వాదనల తర్వాత న్యాయస్థానం షేక్ షాజహాన్ కు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది.
షేక్ షాజహాన్ తరపు న్యాయవాది న్యాయవాది రాజా భౌమిక్ అరెస్ట్ వివరాలను వెల్లడించారు. పోలీసులు 14 రోజుల కస్టడీని కోరారని తెలిపారు. అయితే న్యాయస్థానం 10 రోజుల కస్టడీకి అనుమతించిందని చెప్పారు. మార్చి 10న మళ్లీ షేక్ షాజహాన్ ను కోర్టులో హాజరు పరుస్తారని వివరించారు.
Read More: ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండా.. వివాదంలో డీఎంకే
సందేశ్ఖాలీ ప్రాంతంలో కొన్నిరోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో బీజేపీ నేత సువేంధు అధికారి పర్యటించారు. తొలుత ఆయనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సందేశ్ఖాలీ ప్రాంతంలో పర్యటించారు. బాధితులను కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
షేక్ షాజహాన్ను సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేయవచ్చని కలకత్తా హైకోర్టు కూడా ఆదేశించింది. ఆ తర్వాతే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టు ఆదేశాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా స్పందించింది. నేరస్తులను అధికార పార్టీ రక్షించదని స్పష్టం చేసింది. షేక్ షాజహాన్ ను 7 రోజుల్లో అరెస్ట్ చేస్తామని ప్రకటించింది. కానీ చాలా వేగంగా బెంగాల్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ED బృందం జనవరి 5న రేషన్ స్కామ్కు సంబంధించి షేక్ షాజహాన్ ఇంటిలో సోదాలు జరిపేందుకు వెళ్లింది. అప్పుడు వెయ్యిమందితో కూడిన గంపు దాడికి పాల్పడింది. అప్పటి నుంచి షాజహాన్ పరారీలో ఉన్నాడు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ షేక్ షాజహాన్ అరెస్టును స్వాగతించారు. బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలో సంచరిస్తున్న నేరస్థులను కటకటాల వెనక్కి నెట్టాల్సిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు. ఇది హింస ముగింపునకు ప్రారంభం అని ఆయన పేర్కొన్నారు. బెంగాల్లో హింసాకాండకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో గూండాలు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. దీనికి ముగింపు పలకాలని కోరారు. గ్యాంగ్స్టర్లను కటకటాల వెనక్కి నెట్టాలని బెంగాల్ గవర్నర్ స్పష్టంచేశారు. సందేశ్ఖాలీ ఘటన ఒక ఉదాహరణ మాత్రమేనని కంటికి కనిపించే దానికంటే ఎక్కువ అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు. మొత్తంమీద కొన్నిరోజులుగా నెలకొన్ని ఉత్కంఠకు తెరపడింది. పోలీసులు ఎట్టకేలకు టీఎంసీ లీడర్ షేక్ షాజహాన్ ను అరెస్ట్ చేశారు.