China Flag in Government Ads(Today’s news in telugu): తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో.. ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రూ.986 కోట్ల వ్యయంతో ఇస్రో స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన సెల్ దేశీయ వాటర్ క్రాఫ్ట్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అలాగే చిదంబరనార్ ఓడరేవు ఓటర్ పోర్ట్ కార్గొ టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్ హైస్ లను వర్చువల్ గా ప్రారంభించారు. తూత్తుకుడిలో మొత్తం రూ.17,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికలలో ఇచ్చిన యాడ్స్ లో భారీ తప్పిదం దొర్లింది. ఇప్పుడా తప్పిదమే.. డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేసింది. ప్రకటనలో వేసిన రాకెట్ పై చైనా జెండాను ఉంచడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రధాని మోదీ సహా.. బీజేపీ నేతలు డీఎంకేదే తప్పిదమని అనగా.. తూత్తుకుడి ఎంపీ కనిమొళి మాత్రం పార్టీని సమర్థించడం గమనార్హం. ఈ యాడ్ లో ఆర్ట్ వర్క్ చేసిందెవరో తెలీదు కానీ.. భారత్ చైనాను శత్రుదేశంగా ప్రకటించినట్లు తాను భావించడం లేదన్నారు.
Read More : లోక్ సభ ఎన్నికలు.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ..!
ఇస్రో సెకండ్ లాంచ్ ప్యాడ్ శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్థానిక దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. అందులో.. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయ జెండాతో ఉన్న రాకెట్ కనిపించింది. దాంతో తీవ్ర దుమారం రేగింది. బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ సైతం.. డీఎంకే నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోగా.. తప్పుడు క్రెడిట్ ఆపాదించుకుంటోందని నిప్పులు చెరిగారు. ఇస్రో లాంచ్ ప్యాడ్ పై కూడా చైనా స్టిక్కర్ ను అంటించి క్రెడిట్ ను వారికే ఇస్తున్నారని విమర్శించారు. అంతరిక్ష రంగంలో దేశ ప్రగతిని అంగీకరించేందుకు డీఎంకే సిద్ధంగా లేదని, ఇలాంటివి చేసి మన శాస్త్రవేత్తల్ని అవమానిస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.
వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్రానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిరం అంశంపై కూడా పార్లమెంట్ లో చర్చ జరిగినపుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నా.. ప్రజల విశ్వాసాలపై డీఎంకే ద్వేషం చూపిస్తోందని విమర్శించారు. ఏది ఏమైనా.. వికసిత్ భారత్ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. పదేళ్ల ట్రాక్ట్ రికార్డు.. రాబోయే ఐదేళ్లకు కావాల్సిన విజన్ తమకు ఉన్నాయని పేర్కొన్నారు.