చోళ సూట్ ప్రత్యేకతలు ఇవే..!
Chola Suite : చోళ సూట్.. ఇది అతిథి గృహం పేరు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11 తేదీ రాత్రి ఇక్కడే బస చేస్తారు. అసలు ఈ చోళ సూట్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. దేశ రాష్ట్రపతులు, ప్రధానులే ఇక్కడ బస చేస్తుంటారు. ఈ అతిథిగృహం భద్రతాపరంగా అత్యంత సురక్షితం. తూర్పు నౌకా దళం పర్యవేక్షణలో ఉన్న విశాఖపట్నం ఐఎన్ఎస్ సర్కార్స్లోనే చోళ సూట్ ఉంది. ఈ అతిథి గృహం నిత్యం నిఘా నీడలో ఉంటుంది. చోళ సూట్ కు అనుమతి లేని వ్యక్తులు చేరుకోవడం అసాధ్యం. భద్రతా వలయాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఇక్కడ రాష్ట్రపతి, ప్రధాని లాంటి వ్యక్తులకు బస ఏర్పాటు చేస్తారు.
మోదీ షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో రెండు రోజులు పర్యటిస్తారు. నవంబర్ 11 సాయంత్రం విశాఖ పాత విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగకు ప్రధాని మోదీ చేరుకుంటారు. నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్ చోళలో రాత్రి బస చేస్తారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నవంబర్ 12 న నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. రూ.7,614 కోట్లతో చేపట్టే 5 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
విశాఖకు గవర్నర్ , సీఎం
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 11 సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత ఐఎన్ఎస్ డేగకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం నోవాటెల్కు చేరుకొని రాత్రి బస చేస్తారు. నవంబర్ 12న ఏయూకు చేరుకుని ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో ఐఎన్ఎస్ డేగకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్ గెస్ట్హౌస్లో బస చేస్తారు. నవంబర్ 12న ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరవుతారు. ప్రధాని, గవర్నర్, సీఎం పర్యటనల నేపథ్యంలో విశాఖలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.