Radisson Drugs Case Update : రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక దశ కు చేరుకుంది. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. అబ్బాస్ తో పాటు వివేకానంద కార్ డ్రైవర్ ప్రవీణ్ను కూడా విచారణ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రవీణ్ అకౌంట్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తేల్చారు. విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. వివేకానంద కోసం డ్రగ్స్ తెచ్చే వాడినని.. పార్టీ లకు చాలా మంది ప్రముఖులు వచ్చే వారని అబ్బాస్ తెలిపాడు. పార్టీ జరుగుతుందంటే ముందుగానే గోవా నుంచి కొకైన్ తెచ్చే వాడినని అన్నాడు. క్రిష్ కూడా పార్టీ కి వచ్చారని.. కానీ డ్రగ్స్ తీసుకున్నారా.. లేదా అనేది తనకు తెలియదని వివరించాడు. ఇలాంటి పార్టీ లలోనే ప్రొడ్యూసర్ కేదార్ పరిచయం అయినట్టు తెలిపాడు. చాలా మంది ప్రముఖులకు అబ్బాస్ డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసులు తేల్చారు.
Read More : నైరాశ్యంలో బీఆర్ఎస్.. పీకల్లోతు కష్టాల్లో కారు పార్టీ
గతేడాది నుంచి ప్రధాన నిందితుడు వివేకానంద డ్రగ్స్ కి బానిస అయినట్లు రిమాండ్ రిపోర్టు లో పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు FIRలో A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్ , A12 గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్ను చేర్చారు. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన A10 డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు తేల్చారు. డ్రగ్ పార్టీ లో శ్వేత ,లిషి ,నీల్ కూడా కొకైన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారీ రాడిసన్ హోటల్ లో డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు గుర్తించారు.
ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్, కేదార్నాథ్, సందీప్, శ్వేత , లిసి, నీల్ ,డైరెక్టర్ క్రిష్ తో డ్రగ్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. పేపర్ రోల్ని ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ 3 గ్రాముల కొకైన్ సేవించినట్టు తెలుస్తోంది. రాడిసన్ హోటల్లోని 1200, 1204 నంబర్ గదుల్లో డ్రగ్స్ సేవించినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తేల్చారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ చాటింగ్ను కూడా గుర్తించారు.
డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ.. మీర్జా వహీద్ బేగ్ నుంచి 1 గ్రాము కొకైన్ ను 14 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. వివేక్ సూచన మేరకు 2 గ్రాముల కకైన్ ను అతని డ్రైవర్ ప్రవీణ్ కు డెలివరీ చేసినట్లు వివరించాడు. 2 గ్రాముల కొకైన్ కు గాను.. రూ. 32000 ను డ్రైవర్ ప్రవీణ్ గూగుల్ పే ద్వారా అలీకి చెల్లించినట్లు గుర్తించారు.