BCCI Removed Shreyas and Ishan : బీసీసీఐ అన్నంత పని చేసింది. చెప్పిన మాట వినకపోతే వార్షిక కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించింది. రంజీల్లో ఆడకపోతే ఐపీఎల్ లో ఆడటం కుదరదని కూడా బెదిరించింది. ఇద్దరు ఆటగాళ్లపై సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించింది. అయినా సరే, కుర్రాళ్లిద్దరూ మాట వినలేదు. ఫామ్ లోకి రాలేదు. దీంతో భారత క్రికెట్ బోర్డు 2023-24 సీజన్ కు సీనియర్ క్రికెటర్ల వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. వీటిలో శ్రేయాస్, ఇషాన్ కిషన్ ఇద్దరి పేర్లను తొలగించింది.
ఇషాన్ కిషన్ అయితే 2023 వన్డే వరల్డ్ కప్ లో ఉన్నాడు. తర్వాత టీ 20 ఆస్ట్రేలియా సిరీస్ లో ఉన్నాడు. చివరికి సౌత్ ఆఫ్రికా టీమ్ లో కూడా ఉన్నాడు. అయితే చాలా మ్యాచ్ ల్లో బెంచ్ కే పరిమితం అయ్యాడు. దీంతో ఆ ఒత్తిడి భరించలేక ఇండియాకి తిరిగొచ్చేశాడు. తర్వాత ఒకసారి బిగ్ బి అమితాబ్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. అంతే మళ్లీ కనిపించ లేదు. కానీ హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేశాడనే ప్రచారమైతే జరిగింది.
ఇక శ్రేయాస్ విషయానికి వస్తే, తనకి వన్డే వరల్డ్ కప్ నుంచి పలు అవకాశాలిస్తూ వచ్చారు. అప్పటి నుంచి జరిగిన ప్రతీ సిరీస్ లో తను ఉన్నాడు. ఒకదాంట్లో ఆడటం, మూడింట్లో చేతులెత్తేయడం ఇదే వరుస. బహుశా తనకి వెన్నుముక ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి తన ఆట లయతప్పింది. ముంబాయి తరఫున అస్సాంతో జరిగిన మ్యాచ్, బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఆడాలని బీసీసీఐ కోరింది. తను మాట వినలేదు.
Read More : మ్యాచ్ మధ్యలో క్రికెటర్ కు మ్యారేజ్ ప్రపోజల్.. శ్రేయాంక పాటిల్ రియాక్షన్ ఇదే..!
ఇలా వీరిద్దరికి బీసీసీఐ చిలక్కి చెప్పినట్టు చెప్పింది. పలు అవకాశాలు కూడా ఇచ్చింది. ఆఖరికి అధికారికంగా ఉత్తరాలు కూడా రాసింది. కానీ ఇషాన్ కిషన్, శ్రేయాస్ మొండిఘటాల్లా మారి, చెప్పిన మాట వినలేదు. మొత్తానికి బీసీసీఐ ఏం చేసిందంటే వార్షిక వేతన కాంట్రాక్టుల నుంచి వీరిద్దరిని తొలగించింది.
బీసీసీఐ కొత్తగా చేర్చుకున్నవారు, ప్రమోషన్ లభించిన వారి లిస్ట్ లో చూస్తే గ్రేడ్ ఏ కు రాహుల్, గిల్, సిరాజ్ ప్రమోట్ అయ్యారు. టీ 20 స్టార్ ప్లేయర్ రింకూసింగ్, హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కొత్తగా గ్రేడ్ సిలో చోటు దక్కించుకున్నారు. రిషబ్ పంత్ ఇంకా బీ గ్రేడ్ లో కొనసాగుతున్నాడు.
మూడుటెస్టులు, లేదా 8 వన్డేలు, లేదా టీ 20లు ఆడితే, వారిని కూడా సీ గ్రేడ్ లో చేరుస్తారు. ప్రస్తుతం సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ రెండు టెస్టులు ఆడారు. మూడోది ఆడితే వారు కూడా సీ గ్రేడ్ లో చేరుతారు. మూడు టెస్టులు ఆడిన రజత్ పటీదార్ ఆల్రడీ అర్హత సాధించాడు.
గ్రేడ్ ఏ ప్లస్: కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ బుమ్రా, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా
గ్రేడ్ ఏ: మహ్మద్ షమీ, సిరాజ్, అశ్విన్, గిల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్,
గ్రేడ్ బీ: యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్
గ్రేడ్ సి: రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూసింగ్, అర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబె, రజత్ పటీదార్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, ప్రసిద్ధ్ క్రష్ణ, ఆవేష్ ఖాన్ ,కేఎస్ భరత్