Telangana DSC New Notification(Latest news in telangana): నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పాత డిఎస్సీ నోటిఫికేషన్ ను విద్యాశాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పేరిట ప్రెస్ నోట్ విడుదలయింది.
నేడు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దరఖాస్తుల ప్రారంభం, గడువు ముగింపు తేదీలతో పాటు నియమ నిబంధనలను వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో ఆన్ లైన్ విధానంలో 10 రోజుల పాటు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాన్ని రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా అదనంగా పోస్టులు పెంచి రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. దీనికి గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని.. వారి దరఖాస్తులు ఆటోమేటిక్గా క్యారీ ఫార్వార్డ్ అవుతాయని తెలిపింది.
Read More : తెలంగాణలో బదిలీల పర్వం.. ఈసారి ఐఏఎస్ లకు స్థానచలనం..
మొత్తం 11 వేల 062 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, లాంగ్వేజ్ పండిట్ 727, పీఈటీలు 182, ఎస్ జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్ జీటీలు 796 ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేస్తూ సీఎం రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి స్కూల్ కు ఉపాధ్యాయుడు ఉండాలన్న సీఎం ఆదేశాల మేరకు మూడు వారాలపాటు కసరత్తు చేసి.. విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో.. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకోగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్షలు జరగలేదు. ప్రభుత్వం మారడంతో.. దానికి మరిన్ని పోస్టుల్ని కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకై పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన పనిలేదని, వాటిని ఆటోమెటిక్ గా అప్డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను ఎంసెట్ తరహాలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బడిబాట కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు వెలువరించనున్నారు.