YSRCP 8th List Candidates(AP political news): ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో అధికార వైసీపీ విడతల వారీగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జులను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఏడు లిస్టులను విడుదల చేసిన వైసీపీ అధిష్ఠానం.. తాజాగా 8వ లిస్ట్ ను విడుదల చేసింది. బుధవారం రాత్రి లిస్టులో రెండు పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Read More :నరసాపురం నుంచే ఎంపీగా పోటీ.. తాడేపల్లిగూడెం సభలో రఘురామకృష్ణరాజు క్లారిటీ..
గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోశయ్య, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ఫైనల్ చేశారు. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, జి.డి నెల్లూరుకు కల్లత్తూర్ కృపాలక్ష్మిని ఇన్ ఛార్జులుగా నియమించారు. తొలి నుంచి మార్పులు చేస్తూ వస్తున్న వైసీపీ.. తాజాగా విడుదల చేసిన జాబితాలోనూ మార్పులు చేసింది. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కిలారి రోశయ్య ఉండగా.. ఆ స్థానంలో అంబటి మురళిని సమన్వయకర్తగా నియమించింది. ఈయన మంత్రి అంబటి రాంబాబుకు సోదరుడు. అలాగే గతంలో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకున్న ఉమ్మారెడ్డి వెంకట రమణ స్థానంలో కిలారి రోశయ్యకు అవకాశమిచ్చింది.
జి.డి. నెల్లూరు అభ్యర్థిని కూడా మార్చింది వైసీపీ. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ కు పంపగా.. ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు నిరాకరించారు. తాజాగా విడుదల చేసిన లిస్టులో ఆయన కుమార్తె కళత్తూరు కృపాలక్ష్మిని జి.డి. నెల్లూరు ఇన్ ఛార్జ్ గా నియమించారు.
కాగా.. ఇప్పటివరకూ మొత్తం 17 పార్లమెంట్, 72 అసెంబ్లీ స్థానాలకు గానూ సమన్వయకర్తల పేర్లను ప్రకటించారు సీఎం జగన్. పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితా తర్వాతే.. పార్టీ మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే బూత్ లెవల్ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటు తమకు ముఖ్యమని, ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మార్చి 10న అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహించే నాలుగవ సిద్ధం సభకు 6 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు నేతలు. ఈ సభ కంటే ముందే.. ఆఖరి లిస్టును ప్రకటిస్తారని సమాచారం.