IAS Officers Transfers In Telangana : తెలంగాణలో అధికారుల బదీలల పర్వం కొనసాగుతోంది. మొన్నటి వరకు పోలీసుశాఖలో ఎక్కువగా బదిలీలు జరిగాయి. ఎస్ఐ, సీఐ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారులకు తెలంగాణ సర్కార్ స్థానచలనం కల్పించింది. ఇప్పుడు సివిల్ సర్వీసు ఉద్యోగులు వంతు వచ్చింది. తాజాగా ఐదుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. అలాగే 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను వేరే ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చింది. 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం కల్పించింది.
ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీలపై తెలంగాణ సర్కార్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాహుల్ రాజ్ కు మెదక్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించింది. రాజర్నిషాను ఆదిలాబాద్ కలెక్టర్ గా బదిలీ చేసింది. స్నేహ శబరీశ్ ను కుమురంభీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ గా విధులు అప్పగించింది. హేమంత కేశవ పాటిల్ ను హైదరాబాద్ అదనపు కలెక్టర్ గా పంపింది. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా బీహెచ్ సహదేవ్రావుకు బాధ్యతలు అప్పగించింది.
Read More: మాస్టర్ ప్లాన్ 2050కి విజన్ ప్లాన్ డాక్యుమెంట్లు రూపొందించాలి.. అధికారులకు సీఎం ఆదేశం..
జగిత్యాల రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ గా పర్సా రాంబాబుకు బాధ్యతలు అప్పగించింది. హనుమకొండ అదనపు కలెక్టర్గా ఏ వెంకట్రెడ్డిని నియమించింది. సూర్యాపేట అదనపు కలెక్టర్గా బీఎస్ లతను బదిలీ చేసింది. సీహెచ్ మహేందర్ కు ములుగు అదనపు కలెక్టర్ విధులు అప్పగించింది. డి.వేణుగోపాల్ ను భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్గా బదిలీ చేసింది.
రెండువారాల క్రితం పంచాయతీరాజ్ శాఖలోనూ బదిలీలు భారీగా జరిగాయి. అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖలో 105 మంది అధికారులను బదిలీ చేశారు. డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో,సీఈవో, డీపీవోలకు ప్రస్తుతం పని చేస్తున్న చోట నుంచి వేరే ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు.
అలాగే ఎక్సైజ్ శాఖలోని అధికారులకు స్థానచలనం జరిగింది. అప్పుడు 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను బదిలీ చేశారు. అలాగే చాలా చోట్ల తహశీల్దార్లకు స్థానచలనం కల్పించారు. ఆ సమయంలో 132 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. అలాగే 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం కల్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత వరుసగా బదిలీల జరుగుతున్నాయి. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మంచి పేరున్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సేవలు సరిగ్గా అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో 45 రోజుల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో అధికారులది కీలక పాత్ర. ఎన్నికల్లో విధుల్లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులే ఎక్కువగా విధుల్లో ఉంటారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించే శాఖల్లోనే ఎక్కువగా బదిలీలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల బదీలల ప్రక్రియను వేగవతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.