TDP-Jana Sena public meeting in Tadepalli Gudem(Political news in AP): వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసీపా దొంగలపై టీడీపీ-జనసేన శ్రేణులు పోరాడాలని సూచించారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన మాట్లాడారు.
తాడేపల్లిగూడెం సభ చరిత్ర తిరగరాసే సభ అని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇదేనన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని చేసిన వారిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి కీలకమని అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగబోతున్నాయన్నారు. రెండు పార్టీలు కలిసింది రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమన్నారు.
విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికే తాను, పవన్ చేతులు కలిపామని చంద్రబాబు అన్నారు. ఈ రోజు టీడీపీ, జనసేనల పొత్తు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమేనని అన్నారు. రాష్ట్రంలో ఒక వ్యక్తి అహంకారన్ని చూస్తూ ఉండలేమన్నారు. అందుకే ఈ పొత్తు ప్రజలు కోరుకున్న పొత్తు అన్నారు.
2029కి విజన్ డ్యాక్యుమెంటు తయారు చేశామని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశామన్నారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరాలకు నీళ్లుచ్చే సంకల్పంతో ముందుకెళ్లామన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉందన్నారు. ఏ సీఎం అయినా అభివృద్ది పనులతో పాలన సాగిస్తారు కానీ.. జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారని చంద్రబాబు అన్నారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికేటర్ హనుమ విహారీ పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. సొంత చెల్లి మరో పార్టీలో చేరితో సోషల్ మీడియాలో వేధించారన్నారు. జగన్ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనమని, అందుకే వైసీపీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలన్నారు.
Read More: టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలు.. తాడేపల్లిగూడెం, ప్రత్తిపాడులో వేదికలు సిద్ధం..
జగన్ గతంలో 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారన్నారు. ఒక్క రోజుల్లోనే అంతా సర్దుకొని పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందన్నారు. జగన్ పాలన ఒక అట్టర్ ప్లాప్ సినిమా.. అలాంటి సినిమాకి సీక్వేల్ ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ , జనసేన కూటమి సూపర్ హిట్.. వైసీపీ గుండాలకు తమ సినిమా చూపిస్తామన్నారు. వైనాట్ 175కాదు.. వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అన్నారు.
సిద్దం అంటున్న జగన్ కు యుద్ధం ఇద్దాం.. పవన్ కళ్యాణ్
అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. సిద్ధం అంటున్న జగన్కు యుద్ధం ఇద్దామని అన్నారు. రాష్ట్రంలో ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారు. టీడీపీ-జనసేన కలిస్తేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని పొత్తు పెట్టుకున్నామని పవన్ అన్నారు. “పర్వతం ఎవరికీ వంగి సలా చేయదు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది.. మన విజయానికి స్పూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేశాం” అని అన్నారు.
ఏపీలో రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థతి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ ఐదుగురే పంచాయతీ చేస్తున్నారన్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులులేవన్నారు. వైసీపీ గుండాలు టీడీపీ, జనసేన నాయకులను ఇబ్బంది పెడితే మక్కెలు విరగొట్టి మంచాన పడుకోపెడతామని హెచ్చరించారు.
సీఎం జగన్ మూడు రాజధానులని చెప్పి వాటి అడ్రస్సె లేకుండా చేశారని రఘురామరాజు అన్నారు. దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు చంద్రబాబు, పవన్ లు కృష్ణార్జునుల్లా కలిశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని డ్రగ్స్ కు రాజధానిని చేశారని ఆయన దుయ్యబట్టారు.
కొణతల రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ-జనసేనల పొత్తు చారిత్రక అవసరమన్నారు. కురుక్షేత్ర యుద్దంలో చంద్రబాబు, పవన్ విజయఢంకా మోగిస్తారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి అందరూ కలిసి పని చేయాలన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలనను అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.