EPAPER

ktr Telangana News: ఐటీ వృద్ధిపై కేటీఆర్‌ గోబెల్స్ ప్రచారం..!

ktr Telangana News: ఐటీ వృద్ధిపై కేటీఆర్‌ గోబెల్స్ ప్రచారం..!

 


ktr

KTR campaign on IT growth: తెలంగాణ రాకముందు దేశంలో ఐటీ అంటే బెంగళూరు పేరు వినిపించేదనీ, బీఆర్ఎస్ పాలనా పగ్గాలు చేపట్టాక.. ఐటీ మంత్రి కేటీఆర్ ఘనత కారణంగా నేడు ప్రపంచం ఐటీ అనగానే హైదరాబాద్‌ను గుర్తుచేసుకుంటుందనే వార్తలు 2 నెలల క్రితం వరకూ రోజూ ఏదో ఒక ప్రసారమాధ్యమంలో కనిపిస్తుండేవి. కానీ.. భాగ్యనగరానికి ఐటీ పరిశ్రమ పాదుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు 32 ఏళ్ల నాడే మొదలయ్యాయి. 1992లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక టెక్నాలజీ పార్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోన్న సమయంలో కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 6 ఐటీ స్పెషల్ ఎనకమిక్ జోన్‌లను ప్రకటించింది. వాటిలో ఒకటి హైదరాబాద్‌కు దక్కేలా నాటి ఉమ్మడి ఏపీ సీఎం నేదురుమల్లి జనార్దన రెడ్డి చొరవ తీసుకున్నారు.


దీనికోసం 10 ఎకరాల భూమి, నాలుగున్నర కోట్ల నిధులను కేటాయించి, దానికి శంకుస్థాపన కూడా చేశారు. అలా తొలిసారి భాగ్యనగరంలో ఐటీకి కాంగ్రెస్ హయాంలో అంకురార్పణ జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో దీనిని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక హైటెక్ సిటీ అనే ఆలోచన రూపుదాల్చింది. ఇందులో తొలి అడుగుగా సైబర్ టవర్స్ నిర్మాణం జరిగింది. ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించిన ఈ టవర్స్ పని ప్రారంభించిన 14 నెలల్లో సిద్ధమైంది. నాటి ప్రధాని వాజ్‌పేయి 22 నవంబరు, 1998న దీనిని ప్రారంభించారు. నాటి నుంచి లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తూ.. హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక చిరునామాగా సైబర్ టవర్స్ నిలిచింది. దీనిని క్రమంగా విస్తరిస్తూ.. హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. 1996 నుంచి 2004 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి ఇచ్చిన అత్యధిక ప్రాధాన్యం కారణంగానే ఇదంతా సాధ్యమైంది.

read more: ఎత్తిపోతలు.. ఉత్త మాటలు..!

కేటీఆర్, ఆయన అనుచరులు చెబుతున్నట్లుగా నాటి ప్రభుత్వాలు కేవలం ఐటీ పరిశ్రమల పేరుతో సొంత ఇమేజ్ పెంచుకోలేదు. ఎలాంటి హడావుడీ చేయలేదు. అంతేకాదు.. ఐటీ కంపెనీలు హైదరాబాద్ తరలిరావటానికి అవసరమైన వాతావరణాన్ని నగరంలో ఏర్పరిచేందుకు నిజాయితీగా పనిచేశారు. ముఖ్యంగా మంచి రోడ్లు, ఫ్లై ఓవర్లు, పెద్ద హోటళ్లు, మెరుగైన రవాణా సౌకర్యాలు, శాంతి భద్రతల కల్పన, ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించటం, బిల్ గేట్స్ వంటి ప్రముఖులను ఆహ్వానించటం, విప్రో వంటి సంస్థలు తరలిరావటం, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూలు ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రమానికి ప్రతిపాదనలు వంటి ఎన్నో నిర్ణయాలతో హైదరాబాద్ వార్తల్లో నిలిచేలా నాటి టీడీపీ ప్రభుత్వం చొరవ తీసుకుంది.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత టీడీపీ హయాంలో ఐటీ అభివృద్ధిని గచ్చిబౌలి, ఆదిభట్ల వంటి శివారు ప్రాంతాలకు విస్తరింపజేయటంతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు, ఘట్‌కేసర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు వంటివి పట్టుదలగా పూర్తిచేసింది. అంతేకాదు.. విమానాశ్రయం ఏర్పాటు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో రైలు ప్రతిపాదనలు వంటివన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే. చంద్రబాబు హయాంలో పెట్టిన వందలాది ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వారంతా ఐటీ రంగపు తొలిదశ ఫలితాలను అందిపుచ్చుకోగా, తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి పేదలు, బలహీన వర్గాల పిల్లలూ ఇంజనీరింగ్ చదువుకునేలా ప్రోత్సహించటంతో రెండవ దశ ఐటీ రంగ ఫలితాలను అంతకు రెట్టింపు మంది అందుకోగలిగారు. నేడు ఐటీ, ఐటీఈఎస్‌ కార్యకలాపాల కోసం వాడే ఏ గ్రేడ్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో హైదరాబాద్.. బెంగళూరును వెనక్కి నెట్టి పురోగమించింది. ఇదంతా ప్రభుత్వ విధానాలు, పనితీరు, నైపుణ్యకేంద్రంగా నగరం ఎదగటం వల్లనే సాధ్యమయ్యాయనేది ఐటీ నిపుణుల మాట.

లక్షల మంది ఐటీ, అనుబంధ రంగాల నిపుణులు హైదరాబాద్ రావటం మొదలయ్యాక కోకాపేట, మాదాపూర్, కొండాపూర్.. ఇలా డజన్ల కొద్దీ ప్రాంతాలు వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. తెలంగాణ ఏర్పడే నాటికే జరిగిన ఈ అభివృద్ధిని అంతా తానే చేసినట్లు కేటీఆర్ చెప్పుకోవటం గడ్డి బండి కింద నడిచే శునకం బండి మొత్తాన్ని తానే లాగుతున్నట్లు భావించటం వంటిదని చెప్పక తప్పదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ విషయంలో తెలంగాణ ప్రజల మనసులు గెలవలేకపోయారేమో గానీ.. హైదరాబాద్ అభివృద్ధికి ఈ ఇద్దరు నేతలు శ్రమించిన తీరును ఎవరూ కాదనలేరు. ఇక.. తెలంగాణ తర్వాత తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలన చేసిన కేసీఆర్.. ఫక్తు కుటుంబ పాలనే చేశారు. రెండు పర్యాయాలు ఐటీ, పరిశ్రమల శాఖను తన కుమారుడైన కేటీఆర్‌కు ఆటబొమ్మ మాదిరిగా అప్పగించి కళ్లు మూసుకున్నారు.

ఈ రెండు దఫాల పాలనా కాలంలో ఐటీ మంత్రిగా ఆయన విదేశీ పర్యటనలు చేయటం, లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చినట్లు పత్రికలు, టీవీలలో వేల కోట్ల ఖర్చుతో ప్రచారం చేసుకోవటానికి మాత్రమే పరిమితమయ్యారు. తెలంగాణ వచ్చాక.. పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకునేందుకు కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్ షిప్స్ నిలిపివేశారు. వీరి పుణ్యాన వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డాయి. గులాబీ పార్టీ పాలనలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత సాంకేతిక విద్యకు దూరమై, ఉపాధి కల్పించలేని నిరర్ధకమైన కోర్సుల్లో చేరాల్సిన దుస్థితి దాపురించింది. కేసీఆర్ పుణ్యమా అని ఆ వర్సిటీల్లో ఫ్యాకల్టీ, సిబ్బంది లేక అవి కూడా రేటింగును కోల్పోతూ వచ్చాయి. మరోవైపు ప్రైవేటు వర్సిటీలకు రెడ్ కార్పెట్ పరచి, అందులో కోట్లు కట్టగలిగిన వారే చదువుకునే పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది.

Read more: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ఇద్దరు ఎంపీలు..

‘హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ రంగానికి అంతా చేసింది నేనే’ అని చెప్పుకునే కేటీఆర్.. తెలంగాణలో నేడు ఊరూరా ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ చదివిన లక్షలాది నిరుద్యోగుల గురించి ఎన్నడూ నోరెత్తలేదు. ఐటీ రంగాన్ని వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఎందుకు విస్తరించలేకపోయారని వారంతా గత ఎన్నికల వేళ.. కేటీఆర్‌ను నిలదీశారు. ఈ కాలంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2024 నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయింది. తమతో పాటు తన బంధువులకూ రాష్ట్ర వనరులను కట్టబెట్టే ప్రయత్నం యథేచ్ఛగా ఈ తొమ్మిదన్నరేళ్లలో జరిగిపోయిందని ఇటీవల బయటికి వస్తున్న గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐటీ అభివృద్ధి చేయకపోగా ఇతర పరిశ్రమలనూ కేటీఆర్ భ్రష్టు పట్టించారు. దేశంలోనే అత్యంత తక్కువ పారశ్రామికాభివృద్ధి గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

ఐటీ ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమలనూ జిల్లాలకు విస్తరిస్తామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ వినోద్ కుమార్, కవిత వంటి నేతలు ఊదరగొడుతూ వచ్చినా.. ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా.. ఉన్న పరిశ్రమలు మూతబడ్డాయి. వీరి నిర్వాకంతో 40 లక్షల మందికి ఉపాధి లేకుండా పోయింది. ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐటీ పరిశ్రమలోనూ కొన్ని సంక్షోభాలు వచ్చే ప్రమాదమూ ఉంది గనుక.. రాబోయే రోజుల్లో తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీతో పాటు ఇతర పరిశ్రమలనూ ప్రోత్సహించాలి. అప్పుడే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది.

ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×