ktr about Kaleshwaram Project: తెలంగాణ జీవనాడిగా చెబుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద అపోహలు పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలకు దిగారు. కాళేశ్వరం వృధా అయితే.. ఆ ప్రాంతంలో పెరిగిన భూగర్భ జలాల మాటేమిటని ఆయన విమర్శకులను ప్రశ్చించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం గురించి ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే సంస్థ కూడా సిలబస్లో పెట్టిందని గుర్తు చేశారు. తెలంగాణ భూ నైసర్గిక స్వరూపాన్ని బట్టి.. ఎత్తిపోతలు తప్ప మనకు మరో మార్గమే లేదని తేల్చేశారు. కాళేశ్వరం మీద తాము పెట్టినది వృధా ఖర్చు కాదనీ, భవిష్యత్తులో ఇది పదింతల లాభాన్ని తీసుకొస్తుందని చెప్పుకొచ్చారు.
ఎడారి దేశాల్లో తాగునీటి కష్టాలనూ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తిరిగి రాదని తెలిసీ పెట్టే స్కూళ్లూ, కాలేజీలు కూడా వృధాయేనా అనే వింత వాదననూ కేటీఆర్ తెరమీదికి తీసుకొచ్చారు. నాడు రూ.3 లక్షలున్న ఎకరం.. తమ పాలనలో రూ.30 లక్షలు అయిందని, ఇదంతా తాము నీరందించటం వల్లనేనని కాంగ్రెస్ విమర్శలకు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. నాడు.. 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో నేడు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని లెక్కలు చెప్పుకొచ్చారు. కానీ.. వీటన్నింటి గురించి కాగ్ నివేదికలో ఇచ్చిన సమాచారానికి, కేటీఆర్ చెప్పే లాజిక్కు మ్యాచ్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రాజెక్టు కట్టినా.. దానికి డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను ముందుగా తయారు చేసి ఆర్థిక, పర్యావరణ, సామాజిక నిపుణులతో చర్చించి ఆమోదిస్తారు. కానీ.. ఇందుకు భిన్నంగా కాళేశ్వరం మన మనసులో మెదిలిన గొప్ప ఆలోచన అని కేసీఆర్ పలుమార్లు ప్రకటించమే గాక.. ఎవరి సలహా, చర్చ లేకుండా ప్రకటించి పనిలోకి దిగారు. దీనిపై వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం.. ప్రాజెక్ట్ వ్యయం రూ.63,352 కోట్ల నుంచి రూ.1,02,267 కోట్లకు పెరిగినట్లు గణాంకాలతో లెక్క తేల్చింది. ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను అతిగా ఊహించుకుని చెబుతున్నారని పేర్కొంది. ప్రాజెక్టు నడవటానికి ఏటా రూ.10,647 కోట్లు కావాలని, మెయింటెనెన్స్ కోసం మరో రూ.272 కోట్లు అవుతుందని తెలిపింది. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరగ్గా, ఆయకట్టు మాత్రం 52 శాతం మాత్రమే పెరిగిందని తేల్చి చెప్పింది. ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఒకేసారి అనుమతి ఇవ్వలేదనీ, విడదల వారీగా అంచనాలు పెంచుకుంటూ పోయి.. విడివిడిగా అనుమతులు ఇచ్చారని కాగ్ నివేదిక అభ్యంతరం తెలిపింది.
2022 మార్చి నాటికి రూ.1,10,248 కోట్ల పనులకు అనుమతులిచ్చారనీ, ప్రాజెక్టు కోసం నిధుల సేకరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని కాగ్ స్పష్టం చేసింది. నిధుల కోసం కేఐసీసీఎల్ అనే సంస్థను ఏర్పాటు చేశారనీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలతో దీని ద్వారా రూ.87,449 కోట్ల రుణాలను సమీకరించారని తెలిపింది. అయితే.. ఈ అప్పు మీద ఏటా 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ కట్టాల్సి ఉందని వివరించింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించిన ప్రదేశం సరైనది కాదని, భూకంపాలపై లోతైన అధ్యయానాలేవి నిర్వహించకుండానే ప్రాజెక్టు కట్టారని భూగర్భ పరిశోధనా సంస్థ ఎత్తిచూపింది. నిల్వ సామర్థ్యం, ఇతర సమస్యలేవీ అధ్యయనం చేయకుండానే, రూ.6,126 కోట్లు ఖర్చు పెట్టారని కాగ్ అక్షింతలు వేసింది.
Read more: మాస్టర్ ప్లాన్ 2050కి విజన్ ప్లాన్ డాక్యుమెంట్లు రూపొందించాలి.. అధికారులకు సీఎం ఆదేశం..
కాళేశ్వరం డీపీఆర్ తయారుచేసిన వ్యాప్కోస్ సంస్థ చరిత్ర అంత గొప్పదేమీ కాదని కూడా కాగ్ నివేదక ప్రస్తావించింది. వ్యయానికి తగ్గ లాభం కలగదని స్పష్టం చేసింది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని, రీ ఇంజినీరింగ్ పేరుతో ఎడాపెడా చేసిన మార్పులతో అప్పటికే చేసిన పనుల మీద పెట్టిన రూ.765 కోట్ల ఖర్చు గంగపాలు అయిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్ ఆమోదం పొందకముందే.. రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులను కాంట్రాక్టర్లకు ఎలా అప్పగించారో అర్థంకావటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఆదాయం లేని కాళేశ్వరంపై ఇంత పెట్టుబడి పెడితే.. ఈ ప్రాజెక్టు నిర్వహణ భారం బడ్జెట్ మీద పడుతుందని, అంతిమంగా అది నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. విచిత్రంగా కేటీఆర్ మాత్రం ప్రెస్ మీట్లో పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రశ్నలకు సమాధానాలు లేవు. నిజంగా అవి లేకుండా జాగ్రత్త పడ్డారు. చాలా జనరల్గా నాలుగు ప్రశ్నల పేరుతో దబాయించి.. దాటుకుని పోయారు తప్ప ఆయన వాదనలో రవ్వంత తర్కం కూడా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.