Vandebharath Rail: దక్షిణ భారత్ దేశంలో వందే భారత్ రైలు పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో ఈ రైలును ప్రారంభించారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్బేస్కు చేరుకున్న ప్రధానికి కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోట్, సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ కేఎస్సార్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు బెంగళూరు నుంచి మైసూరు మీదుగా చెన్నై వరకు నడుస్తుంది. దేశంలో ఇది ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని ప్రారంభించారు. యాత్రికుల కోసం తీసుకొచ్చిన ఈ సర్వీసులో 8 రోజుల టూర్ ప్యాకేజీ ఉంది. ఈ రైలులో వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ లాంటి పవిత్ర స్థలాలను దర్శించుకోవచ్చు.
అంతకుముందు మోదీ.. ప్రముఖ కవి కనకదాస జయంతిని పురష్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత మహర్షి వాల్మీకి విగ్రహాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ప్రధాని.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.5వేల కోట్లతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రారంభిస్తారు. 108 అడుగుల ఎత్తైన నాద ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత తమిళనాడులోని దిండిగల్కు వెళ్లి అక్కడ గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో మోదీ పాల్గొంటారు.