Attack on Bandi Sanjay Convoy: హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థతులు నెలకొన్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. హనుమకొండ జిల్ల భీమదేవరపల్లి మండలం వంగరలో ఈ ఘటన జరిగింది. పీవీ నరసింహారావు స్వగ్రామంలో పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానిగా పని చేసిన ఏకైక నాయకుడు పీవీ నర్సింహరావు అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఠీవీగా, పీవీ బహుభాషా కోవిదుడిగా, కవిగా, రచయితగా జర్నలిస్టుగా పని చేశాన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించి దేశానికి ఎనలేని సేవలను చేశారని బండి సంజయ్ కొనియాడారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ప్రకటించిన ఘనత ప్రధాని మోదీ ప్రభుత్వానిదేనని కొనియాడారు.
పీవీ లాంటి గొప్ప వ్యక్తి చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా పీవీ ఆత్మను, ఆయన కుటుంబ సభ్యులను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. పీవీని కాంగ్రెస్ పార్టీని ఎందుకు అవమానించిందో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం కూడా వ్యక్తం చేయలేదన్నారు. అనంతరం బండి సంజయ్ మల్కాపూర్ బయలు దేరుతుండగా ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో అవి కాన్వాయ్ లోని మీడియా వాహనంపై పడ్డాయి దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Read More: తిరుగువారంతో మేడారం జాతర ముగింపు.. పెరిగిన భక్తుల రద్దీ..
ఈ ఘటనపై కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్ మాట్లాడుతూ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత అక్కర్లేదన్నారు. పోలీసులు కూడా తనతో రావద్దన్నారు. తన రక్షణ మొత్తం తమ కార్యకర్తలే చూసుకుంటారని ఆయన మండిపడ్డారు. అయితే కాన్వాయ్ పై కోడిగుడ్లు పడటంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.