CBI Summons To Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. యూపీలో జరిగిన అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. ఈ కేసులో అఖిలేశ్ ను సాక్షిగా సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ రావాలని సమన్లు జారీ చేసింది. గురువారం ఆయనను ప్రశ్నిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
యూపీలో అక్రమ మైనింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో మైన్ల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2012-2016 మధ్య గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ప్రధాన అభియోగం. రూల్స్ ను అతిక్రమించి అధికారులు గనులు కేటాంపులు చేశారని ఆరోపణలు వచ్చాయి.
Read More: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం.. సీఎం రాజీనామా..!
2012- 2017 మధ్య అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదిపాటు మైనింగ్ శాఖ ఆయన చేతుల్లో ఉంది. ఆ బాధ్యతలు అఖిలేశే పర్యవేక్షించారు. అందువల్లే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుణ్ని టార్గెట్ చేస్తూ సీబీఐ నోటీసులు ఇచ్చింది.
ఇసుక తవ్వకాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు రిఫర్ చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను సీబీఐ తమ ఎదుట హాజరు కావాలని బుధవారం కోరింది. ఫిబ్రవరి 29న ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చింది.
అఖిలేశ్ యాదవ్ కు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్ ఏదైనా కేసు విచారణకు సాక్షులను పిలవడానికి పోలీసు అధికారికి అనుమతిస్తుంది. ఈ-టెండరింగ్ ప్రక్రియను ఉల్లంఘించి మైనింగ్ లీజులిచ్చారని ఈ కేసులో ప్రధాన ఆరోపణలు. మైనింగ్ అక్రమాలపై విచారణకు గతంలోనే అలహాబాద్ హైకోర్టు విచారణకు ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడిన వేళ అఖిలేశ్ యాదవ్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇండియా కూటమి సమాజ్ వాదీ పార్టీ భాగస్వామిగా ఉంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ తో అవగాహన కుదిరింది. ఎంపీ సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య సయోధ్య కుదిరింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర యూపీలో సాగుతున్న సమయంలోనే సీట్ల కేటాయింపులపై ఇరుపార్టీలు అవగాహన వచ్చాయి.
కాంగ్రెస్ , ఎస్పీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. ఆగ్రాలో రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్న సమయంలో హాజరయ్యారు. రాహుల్ గాంధీ, అఖిలేశ్ చేతులు కలిపారు. ఇలా కాంగ్రెస్, ఎస్పీల మధ్య ఎంపీ సీట్ల పంపకాలు సజావుగా సాగాయి. ఇక యూపీ బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు సీబీఐ అఖిలేశ్ కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగుతోంది.