Himachal Pradesh CM Sukhwinder Sukhu : హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం సుఖ్వీందర్ సుఖూ తన పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. అటు ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. ఈ పరిణామాలు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామాకు దారితీశాయి. కొందరు ఎమ్మెల్యేలు తిరుబాటుతో కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలో పడింది. మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీమానాతో ఈ సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారని తెలుస్తోంది. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారని వార్తలు వచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అయితే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో వివాదం రేగింది. రెబల్ సభ్యులు సుఖ్వీందర్ సింగ్ సర్కార్ పై తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆయన పదవికి గండం ఏర్పడింది.
Read More: రాజీవ్ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!
ఎమ్మెల్యేలను సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పట్టించుకోవడంలేదని రాజీనామా చేసిన మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో తాను అవమానాలు పడ్డానని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి అందుబాటులో లేరు. సీఎం రాజీనామా చేయాలని అంతకుముందు పట్టుబట్టారు. ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ అధిష్టానానికి తమ వైఖరిని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానమే సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రిని మారిస్తే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని అల్టిమేటం జారీ చేశారు.
మరోవైపు తాజా పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పడగొట్టడానికి కమలనాథులు ఈ విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీలో సంక్షోణాన్ని చక్కదిద్దేందుకు కీలక నేతలు ఆ రాష్ట్రానికి వెళ్లారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికపప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరా తీస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.