TDP-Janasena Public Meetings(AP news live) : ఏపీలో టీడీపీ-జనసేన ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే సీట్లు సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతలు అవగాహనకు వచ్చారు. 94 మంది టీడీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేన 24 సీట్లలో పోటీ చేస్తుందని ఆయనే చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇలా సీట్ల వ్యవహారం కొలిక్కి రావడంతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు చంద్రబాబు , పవన్ కల్యాణ్ సన్నద్ధమయ్యారు.
ఏపీలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ , జనసేన సిద్ధమయ్యాయి. తొలి సభ తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం సాయంత్రం జరగనుంది. అలాగే రెండో సభ కూడా ఈ రోజే ప్రత్తిపాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వేదికపై కనిపించనున్నారు. ఇరు పార్టీల అధినేతల ఇచ్చే సందేశం కోసం టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాడేపల్లిగూడెం, ప్రత్తిపాడు సభలకు భారీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. బహిరంగ సభకు పెట్టిన పేరు కూడా ఆసక్తిని రేపుంతోంది. తెలుగు జన విజయ కేతనం జెండా పేరుతో నిర్వహించే ఈ సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక అంశాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధిపై ఉమ్మడి అజెండాను సభ వేదికపై ఆవిష్కరిస్తారని సమాచారం.
Read More: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..
మరోవైపు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు చంద్రబాబు, పవన్ కల్యాణ్ గట్టిగా కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ-జనసేన బహిరంగ సభలకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మహిళల కోసం స్పెషల్ గ్యాలరీలు ఏర్పాటు చేశారు.