India vs England 5th Test Updates: టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ సిరీస్లో కేవలం ఒక టెస్ట్ మాత్రమే ఆడాడు. అతని క్వాడ్రిసెప్స్లో సమస్య కారణంగా విశాఖపట్నం వేదికగా జరిగిన రెండవ టెస్ట్కి దూరమయ్యాడు.
అయితే రాజ్కోట్లో మూడో టెస్టు ముందువరకు రాహుల్ 90 శాతం ఫిట్నెస్తో మాత్రమే ఉన్నాడు. దీంతో బీసీసీఐ( BCCI) అతన్ని ఆడించే ప్రయత్నం చేయలేదు. రాంచీ టెస్టుకు కూడా ఫిట్నెస్ లేని కారణంగా దూరమయ్యాడు. రాహుల్ ధర్మశాల టెస్టులో పాల్గొనడం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఎందుకంటే అతని గాయంపై నిపుణుల అభిప్రాయం కోసం రాహుల్ లండన్కు వెళ్లాడని క్రిక్బజ్ తాజా నివేదికలు పేర్కొన్నాయి.
రాహుల్ ఇదివరకే తన క్వాడ్రిసెప్స్లో నొప్పి కారణంగా లండన్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత అతను ఆసియా కప్ 2023లోకి తిరిగి వచ్చాడు. ప్రపంచకప్, ఆ తర్వాత జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్లో అద్భుతంగా ఆడాడు. కానీ మళ్లీ నొప్పి తిరగబెట్టింది. దీంతో అతడిని ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు మినహా మిగతా టెస్టుల్లో బీసీసీఐ ఆడించలేదు.
Read More: రంజీ ట్రోఫీలో ముంబై ఆటగాళ్ల రికార్డ్.. చివరి బ్యాటర్లిద్దరూ సెంచరీలు..
సిరీస్లో భారత్ ఇప్పటికే 3-1తో ఆధిక్యంలో ఉన్నందున, 90 శాతం ఫిట్నెస్ ఉన్న రాహుల్తో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోకపోవచ్చు. BCCI ఆటగాళ్ల పనిభారాన్ని నిర్వహించడానికి చూస్తున్నందున ధర్మశాలలో మరో బ్యాటర్, ఒక బౌలర్కు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది.
జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు శుభవార్త ఏమిటంటే, అతను ధర్మశాల టెస్టుకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది పేసర్లకు స్వర్గధామమైన పిచ్గా పేరుండటంతో బుమ్రా ఆడే అవకాశాలున్నాయి. పిచ్ పేసర్లకు సహకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇరు జట్లు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.