Reliance-Disney sign pact to merge media business: వినూత్నమైన రంగాల్లోకి అడుగుపెడుతూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వస్తున్న ముకేష్ అంబానీ.. తాజాగా డిజిటల్ రంగంలోనూ తన ముద్రను వేయబోతున్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిస్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలసి రానున్న రోజుల్లో భారత్లో తమ సేవలను అందించేందుకు ఆయన ఓ భారీ డీల్ మీద సంతకం చేశారు. ఇందులో భాగంగా డిస్నీ ఇండియాలోని 61 శాతం వాటాను రూ. 12,500 కోట్ల రూపాయలకు రిలయన్స్ కొనుగోలు చేసిందని బ్లూమ్ బర్గ్ న్యూస్ వెల్లడించింది. దీంతో డిస్నీ ఇండియా వాటా ఇకపై కేవలం 39 శాతానికే పరిమితం కానుంది. ఈ ఒప్పందంతో తన జియో సంస్థకూ అదనపు విలువ చేకూరుతుందని రిలయన్స్ అంచనా.
ఈ తాజా డీల్ అమల్లోకి వస్తే.. భారత్లో జరిగే ఓటీటీ వ్యాపారం మీద రిలయన్స్ పట్టు సాధించటంతో బాటు జియో తరహాలో ఇతర పోటీదారుల కంటే చౌకగా ఓటీటీ సేవలను రిలయన్స్ అందించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్ మీద త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇటీవలి కాలంలో రిలయన్స్ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు.
Read more: అరగంటలోనే ఫుల్ ఛార్జ్..ఒక్క ఛార్జ్ తో 570 కిలోమీటర్ల ప్రయాణం
2022 నాటి ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకోవాలని డిస్నీ విశ్వప్రయత్నం చేసినా.. చివరి నిమిషంలో వాటిని రిలయన్స్ ఫాన్సీ ధరకు ఆ హక్కులను దక్కించుకుంది. దీంతో డిస్నీ సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోవటంతో ఆ సంస్థ ఇబ్బందిలో పడిపోయింది. అంతటితో ఆగని రిలయన్స్ క్రమంగా దేశీయంగా పేరున్న మీడియా సంస్థల్లో వాటాలను కొనుగోలు చేస్తూ చాపకింద నీరులా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా భారత మార్కెట్లోని పెద్ద సంఖ్యలో ఉన్న నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఖాతాదారులను తనవైపు మళ్లించుకునేందుకు రిలయన్స్ తపన పడుతోంది. తాజా ఒప్పందం యొక్క అసలు ఉద్దేశం అదేనని మీడియా రంగ నిపుణులు చెబుతున్నారు.