Himachal Pradesh Congress Government news(Telugu flash news): హిమాలయ రాజ్యంలో రాజ్యసభ ఎన్నికలు వేడిని రాజేస్తున్నాయి. నిన్నటి రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడటంతో కాంగ్రెస్, బీజేపీలకు సమాన ఓట్లు రాగా, లాటరీ తీయగా అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయిందని బీజేపీ ప్రకటించింది.
68 సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు ఇండిపెండెంట్లున్నారు. నిన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీ, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్కు సమానంగా చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయగా విజయం మహాజన్ను వరించింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అలాగే.. ఈ ఆరుగురు ఓటు వేశాక సిమ్లా నుంచి హర్యానా చేరుకోవటంతో వారంతా బీజేపీతో టచ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హర్యానాలోని పంచ్కులలో ఉన్న ఓ గెస్ట్హౌస్ వద్ద వీరంతా ఉన్న వీడియో వైరల్ కావటం, ఆ వీడియోలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేతో బాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉండటంతో సర్కారు కూలిపోనుందనే వార్తలు వ్యాపించాయి.
Read more: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..
ఇక, నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో విపక్ష బీజేపీ డివిజన్ ఓటింగ్ కోసం పట్టుబట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ మెజారిటీ కోల్పోయిందని, కనుక విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలని సీఎంను కోరాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం అందించారు.
ఈ నేపథ్యంలో అటు.. కాంగ్రెస్ హైకమండ్ దీనిపై వెంటనే స్పందించింది. గోడదూకిన ఎమ్యెలేలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తూనే.. సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్ను సిమ్లా పంపింది. అన్నీ కుదిరితే.. నేటి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.