Rajya Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 15 స్థానాలకు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన ఐదింటిలో కాంగ్రెస్కు 3, సమాజ్ వాదిపార్టీకి 2 స్థానాలు లభించాయి. ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి ఫలితాలు తారుమారు అయ్యాయి.
ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్ కౌంటింగ్ ప్రక్రియలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇక్కడి ఫలితం టై కావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీశారు. ఈ డ్రాలో బీజేపీ అభ్యర్థిని విజయం వరించడంతో కాంగ్రెస్ ఖంగుతింది. ఈ ఓటమి ఆపార్టీ అధికార పీఠానికి ఎసరు పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక యూపీలో 10 స్థానాలకుగాను 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాలలో విజయం సాధించింది. ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
కర్ణాటక మినహా, యూపీ, హిమాచల్ప్రదేశ్లలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పెద్దెత్తున జరిగింది. బీజేపీ ఎత్తుగడల ముందు సమాజ్వాదిపార్టీ,కాంగ్రెస్లు బోల్తా పడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందన్న ఓటమి పాలైన పార్టీలు దుమ్మెత్తిపోశాయి.
సీఆర్పీఎఫ్ బలగాలతో తమ శాసన సభ్యులను బీజేపీ కిడ్నాప్ చేసి క్రాస్ ఓటింగ్కు పాల్పడిందని హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు చేసిన ఆరోపణలతో క్రాస్ ఓటింగ్ ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతోంది.
పాలకపక్షమైన కాంగ్రెస్కు శాసనసభలో కావాల్సినంత బలమున్నప్పటికీ నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి తోడుకావడంతో ఆ పార్టీ అభ్యర్ధి గెలుపు సాధ్యమైంది.
ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్లకు చెరో 34 ఓట్లు రావడంతో డ్రా తీశారు. ఈ డ్రాలో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరపడింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలవ్వడంతో ఆ పార్టీపై రేపు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనందున హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సుఖు తక్షణం రాజీనామా చేయాలని మాజీ సీఎం, బీజేపీ నేత జైరాం ఠాకూర్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని ఆయన అన్నారు. తమపార్టీ బలం 25కు పెరిగిందని ఠాకూర్ ఈసందర్భంగా వెల్లడించారు.
Read More: హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్ట్.. లక్కీ డ్రా ద్వారా అభ్యర్ధి ఎన్నిక..
కాంగ్రెస్ పరాజయానికి సీఎం సుఖు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ ఓటమితో బలంపుంజుకున్న బీజేపీ రేపు శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో ఒకదాన్ని కోల్పోయే పరిస్థితి దాపురించవచ్చు.
మరికొద్ది నెలల్లో 56 మంది రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 15 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి.
కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలకు సంబంధించి జరిగిన ఈ ఎన్నికల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తి కాగా, 5గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. కర్ణాటకలో తొలి ఫలితాలు వెల్లడయ్యాయి.
Read More: లోక్పాల్ ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్..
అక్కడ కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ పాచికలు పారలేదని, ప్రజాస్వామ్యమే గెలిచిందని కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు.