Supreme Court Issues contempt notice TO Patanjali : రామ్దేవ్ యాజమాన్యంలోని పతంజలి ఆయుర్వేదం, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తమ ఉత్పత్తులపై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పంతజలి ఔషధ ఉత్పత్తులను ప్రచారం చేయకుండా కోర్టు నిషేధించింది. అల్లోపతికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారానికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో పతంజలి గ్రూప్ ను అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది.
తప్పుదారి పట్టించే ప్రకటనలను అస్సలు సహించేది లేదని జస్టిస్ అమానుల్లా స్పష్టం చేశారు. ఐఎంఏ తరపున వాదనలు సీనియర్ న్యాయవాది పీఎస్ పట్వాలియా వినిపించారు. యోగా సహాయంతో మధుమేహం, ఆస్తమాను పూర్తిగా నయం చేయగలమని పతంజలి పేర్కొన్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
గత ఏడాది నవంబర్లో కోవిడ్ -19 వ్యాక్సినేషన్కు వ్యతిరేకంగా పంతజలి గ్రూప్ క్యాంపెయిన్ నిర్వహించిందని ఆరోపిస్తూ ఐఎంఎ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సంప్రదింపులు జరపాలని కేంద్రాన్ని కోరింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలను ఎదుర్కోవడానికి కొన్ని సిఫార్సులు చేసింది.
Read More: అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు.. ఎనిమిదోసారి..
పతంజలి ఆయుర్వేదం ఇస్తున్న తప్పుదారి పట్టించే ప్రకటనలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు అలాంటి ఉల్లంఘనలను చాలా సీరియస్గా తీసుకుంటుందని స్పష్టం చేసింది.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అల్లోపతి మందుల వాడకానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలకు ఐఎంఏ దాఖలు చేసిన వివిధ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న బాబా రామ్దేవ్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసులను రద్దు చేయాలనే తన అభ్యర్థనపై అక్టోబర్ 9 న కేంద్రం, అసోసియేషన్కు నోటీసు జారీ చేసింది.
రామ్దేవ్పై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 188, 269, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐఎంఏ ఫిర్యాదు ప్రకారం రామ్దేవ్ వైద్యులు ఉపయోగిస్తున్న మందులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తదుపరి విచారణను కోర్టు మార్చి 15కు వాయిదా వేసింది.