Gaganyaan Mission Updates: గగన్ యాన్ ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగత్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా అంతరిక్షయానం చేస్తారని వెల్లడించారు.
గతంలో రాకేశ్ శర్మ అంతరిక్షంలోని వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. అప్పట్లో రష్యా చేపట్టిన ప్రయోగంలో రాకేశ్ శర్మ భాగస్వామి అయ్యారు. రష్యా వ్యోమనౌకలోనే ఆయన అంతరిక్షయానం చేశారు.
కేరళ పర్యటనలో మోదీ గగన్ యాన్ ప్రాజెక్టుపై వివరాలు వెల్లడించారు. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. వారిని స్టాండింగ్ ఒవేషన్తో గౌరవించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి గగన్ యాన్ ప్రయాణాన్ని వీక్షిస్తామని మోదీ తెలిపారు.ఈ నలుగురు వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులుగా పేర్కొన్నారు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారని వివరించారు. ఈసారి రాకెట్ స్వదేశంలో తయారు చేసిందేనని చెప్పారు.
Read More: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్రఎన్నికల సంఘం క్లారిటీ..
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందిన వేళ గగన్ యాన్ కూడా గొప్ప చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. మహిళా శాస్త్రవేత్తల కృషిని ప్రధాని కొనియాడారు. వారి శ్రమలేకుండా చంద్రయాన్, గగన్యాన్ మిషన్లు సాధ్యంకాదన్నారు.
గగన్ యాన్ ప్రాజెక్టుకు ఎంపికైన నలుగురు ఇప్పటికే శిక్షణ పొందారు. వారికి రష్యాలో శిక్షణ ఇచ్చారు. ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ నలుగురు వ్యోమగాములకు అంతరిక్షయానంపై శిక్షణ ఇచ్చింది. 2025 గగన్ యాన్ చేపట్టబోతున్నారు. నలుగురు వ్యోమగాములు రోదసిలో వెళ్లిన తర్వాత మూడు రోజులకు తిరిగి భూమికి చేరుకుంటారు.