Rs 48,000 Thousand for 4 Dozen Eggs: సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆకతాయిలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. సైబర్ నేరగాళ్లు కొత్త దారుల్లో జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. మొబైల్ నంబర్ కు మెసేజ్ లు పంపి లింక్ లు ఓపెన్ చేయడం అంటే ఏదో మోసం జరుగుతుందని ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకే సైబర్ నేరస్తులు కూడా ఆ దారి వదిలేసి.. సరికొత్త దారులను ఎంచుకుని ఏ మాత్రం అనుమానం రాకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోడిగుడ్ల ద్వారా ఒక మహిళ నుంచి రూ.48 వేలు కాజేశారు.
ఆన్ లైన్ లో 4 డజన్ల కోడిగుడ్లను ఆర్డర్ చేసిన మహిళ.. రూ.48 వేలను పోగొట్టుకున్న ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని వసంత్ నగర్ కు చెందిన మహిళ.. ఫిబ్రవరి 17న ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ నుంచి ఒక ఆఫర్ మెసేజ్ వచ్చింది. దానిపై క్లిక్ చేయగా.. 48 కోడిగుడ్లు కేవలం రూ.49కే అని ఆఫర్ కనిపించింది. అంటే సుమారు ఒక రూపాయికి ఒక కోడిగుడ్డు వస్తుందని సంబరపడిపోయి.. ఆర్డర్ చేసేందుకు వివరాలన్నింటినీ నింపింది. చెల్లింపు ప్రక్రియలో డెలివరీ అడ్రస్, మొబైల్ నంబర్ తో సహా డీటెయిల్స్ ను నింపింది.
Read More: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో
క్రెడిట్ కార్డుతో బిల్ పే చేయడానికి డీటెయిల్స్ ఎంటర్ చేసి.. మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి నగదు చెల్లించింది. రూ.49 కు బదులుగా రూ.48,199 కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె.. కొద్దిసేపటికి తేరుకుని తాను మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే బ్యాంక్ ను సంప్రదించి.. తన క్రెడిట్ కార్డ్ అకౌంట్ ను బ్లాక్ చేయించింది. ఆపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షాపింగ్ ఆఫర్స్, టుడే ఆఫర్స్ ఓన్లీ అంటూ వచ్చే మెసేజ్ ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.