తాడిని తన్నేవాడుంటే… వాడి తలదన్నేవాడుంటాడు అనేది సామెత. ఎలాన్ మస్క్ విషయంలో ఇప్పుడిది సరిగ్గా సరిపోతోంది. ట్విట్టర్ ను కొన్నాక సంచలన నిర్ణయాలతో అందరికీ షాకుల మీద షాకులిస్తున్న మస్క్ కు… ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. మొత్తం సంపద 200 బిలియన్ డాలర్లకు పడిపోయిన షాక్ నుంచి తేరుకోకముందే… ట్విట్టర్ కారణంగా ఇప్పుడు మస్క్ కు మరో షాక్ తగిలింది.
నిజానికి ట్విట్టర్ విలువ ఎక్కువగా లేకపోయినా… ఏకంగా 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్ ను కొని… ఆపై ఉద్యోగుల పొట్టకొట్టి, ఛార్జీల పేరుతో యూజర్ల మీద పడ్డ మస్క్ కు… పెద్ద పెద్ద కంపెనీలు షాకివ్వడం మొదలుపెట్టాయి. ట్విట్టర్లో ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆడి, ఫోక్స్వ్యాగన్, జనరల్ మోటార్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, జనరల్ మిల్స్ ట్విటర్లో ప్రకటనలను నిలిపివేయగా, మరికొన్ని కంపెనీలూ అదే రూట్లో ఉన్నాయి.
ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వచ్చాక ఛార్జీల బాదుడు మొదలవడంతో ఓవైపు యూజర్లు ప్రత్యామ్నాయాలను చూసుకుంటుంటే… మస్క్ మాత్రం తాను సంస్థను కొన్నాక యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కంపెనీలు మస్క్ మాటల్ని నమ్మట్లేదు. ఆడి, ఫోక్స్వ్యాగన్, జనరల్ మోటార్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, జనరల్ మిల్స్ లాంటి బడా కంపెనీలు కూడా ట్విట్టర్ కు ప్రకటనలు ఇవ్వడం మానేస్తున్నామని ప్రకటించాయి. ట్విట్టర్ మస్క్ సొంతమయ్యాక ద్వేషపూరిత ట్వీట్ల పరిమాణం గణనీయంగా పెరిగిందని… ఆ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకే ట్విట్టర్ కు ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పుడు గిలియడ్ సైన్సెస్, దాని విభాగం అయిన కైట్ కూడా ఇదే ప్రకటనలు నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించాయి.
ట్విట్టర్ ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్యోగుల తొలగింపుతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టిన మస్క్… ఆ తర్వాత వెరిఫైడ్ యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు వసూలు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత వినియోగదారులందరి నుంచీ నెలవారీ రుసులు వసూలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో… అటు ఉద్యోగుల పొట్టకొట్టి, ఇటు యూజర్లపై భారం మోపుతున్న మస్క్ కు… పెద్దపెద్ద కంపెనీలు ప్రకటనలు నిలిపివేసి బాగా వాతపెట్టాయని కామెంట్లు పెడుతున్నారు… నెటిజన్లు.