Ashok Veeraraghavan: ఇమేజింగ్ సాంకేతికతతో విప్లవాత్మక పరిశోధనలు చేసిన.. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్ కు ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ (Edith and Peter O’Donnell Award) అవార్డు దక్కింది. ఈ అవార్డును టెక్సాస్ రాష్ట్ర అత్యున్నత అవార్డుల్లో ఒకటిగా భావిస్తారు. ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిని అశోక్ వీరరాఘవన్ కు ప్రకటించింది. చెన్నైలో పుట్టిపెరిగిన ఆయన.. ప్రస్తుతం రైస్ యూనివర్సిటీలోని జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్నారు.
వీరరాఘవన్ తన బృందంతో కలిసి ఇమేజింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక పరిశోధనలు చేశారు. ఆప్టిక్స్ నుంచి సెన్సార్ డిజైన్ వరకూ మెషిన్ ఆల్గొరిథమ్ సాంకేతికతో ఇమేజింగ్ రంగంలో వివిధ సవాళ్లను అధిగమించారు. వాటన్నింటిపై సమీకృత విధానంలో పరిశోధన చేస్తున్నట్లు ప్రొఫెసర్ వీరరాఘవన్ తెలిపారు. ఇప్పుడున్న సాంకేతికతో చూడటం సాధ్యం కాని వాటిని కూడా కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.