Vasantha Krishna Prasad Joins in TDP Party: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు జోరందుకుంటున్నాయి. పార్టీలు మారాలనుకుంటున్న నేతలు మూహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. అధికార పార్టీ వైసీపీ నుంచే ఎక్కువగా నేతలు బయటకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ జాబితాలో చేరారు. ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో చేరతానని అధికారికంగా ప్రకటించారు.
ఐతవరంలో వసంత కృష్ణ ప్రసాద్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. మరో రెండు రోజుల్లో టీడీపీలో చేరతానని ప్రకటించారు. మైలవరం నియోజకవర్గంలోని తన అనుచరులను కలుస్తానని తెలిపారు. రెండురోజుల్లో చంద్రబాబు వద్దకు వెళతానని చెప్పారు. టీడీపీ అధినేత సమక్షంలోనే పసుపు కండువా కప్పుకుంటానని స్పష్టంచేశారు.
మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుపై వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. టీడీపీ పెద్దల సమక్షంలోనే దేవినేని ఉమాతో భేటీ అయ్యి అన్ని అంశాలను చర్చిస్తానన్నారు.
Read More: జనసేన బరిలో నిలిచే సీట్లు ఇవేనా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని జగన్ తనకు గతంలో సూచించారని వెల్లడించారు. వ్యక్తిగతంగానూ దూషించమని చెప్పారని తెలిపారు. అందుకే వైసీపీలో ఉండలేక పోయానన్నారు. వైసీపీలో ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగతం విమర్శలు చేస్తేనే పదవులు దక్కుతాయని తీవ్ర ఆరోపణలు చేశారు.