Jayalalitha’s Jewellery Auction: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలైన దివంగత జయలలిత నగల వేలానికి రంగం సిద్ధమైంది. 1996లో అవినీతి నిరోధకశాఖ జయలలిత మీద ఆదాయనికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఈ సందర్భంగా ఏసీబీ పొయెస్ గార్డెన్లోని ఆమె నివాసమైన వేదనిలయంలో సోదాలు చేసింది. ఈ క్రమంలో 468 రకాల 27 కిలోల బంగారు, వజ్రాల నగలు, 7 క్వింటాళ్ల వెండి సామాన్లు, 740 జతల చెప్పులు, 11, 344 పట్టు చీరలు, 250 శాలువాలు, లెక్కు మించిన గృహోపకరణాలు, దాదాపు 2 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ఈ కేసు విచారణ బెంగళూరులో జరగటంతో ఈ స్వాధీనం చేసుకున్న సొత్తును కర్ణాటక ట్రెజరీలో భద్రపరిచారు. 2014లో జయలలితతో బాటు శశికళ, ఇళవరసి, సుధాకర్లను నేరస్తులుగా ప్రత్యేక కోర్టు నిర్ధారించటమే గాక నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది.
ఈ కేసులో జయలితకు రూ.100 కోట్ల జరిమానా, మిగిలిన ముగ్గురికీ తలా పదికోట్ల జరిమానా విధించగా వారు కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసి బెయిల్ పొందారు. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు కాగా.. సర్వోన్నత న్యాయస్థానం 2017 ఫిబ్రవరి 14న ప్రత్యేక కోర్టు తీర్పును సమర్ధించింది. అయితే.. ఈలోపు జయలలిత అనారోగ్యంతో కన్నుమూయగా, మిగిలిన ముగ్గురు దోషులు జైలు శిక్ష, జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
Read More: జ్ఞానవాపిలో పూజలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
జయ మరణంతో జరిమానా వసూలుకు ఆమె నగలను వేలం వేసేందుకు వీలుగా.. వాటిని మార్చి 6 లేదా 7వ తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇక నగలు భద్రతపర్చడంతోపాటు, కేసు విచారణ జరిపినందుకు కర్నాటక ప్రభుత్వం ఖర్చు చేసిన 5 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కర్నాటకకు చెల్లించింది. ఈ కేసులో జరిమానా రూ. 100 కోట్లతో పాటు కేసు విచారణకు అయిన రూ. 5 కోట్లను రాబట్టుకునేందుకు జయలలితకు చెందిన కొన్ని స్థిరాస్తులనూ వేలం వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
అయితే.. 27 కిలోల నగల్లో 7 కిలోలు తనకు తల్లి నుంచి వారసత్వంగా వచ్చాయని, వాటిని వేలం నుంచి మినహాయించాలని గతంలో జయలలిత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో 20 కిలోల నగలను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్లో జయలలిత ఖాతాలో ఉన్న 60 లక్షల రూపాయల నగదును ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే న్యాయస్థానంలో జమ చేశారు. మరోవైపు మేనత్త నగలమీద హక్కు తనదే గనుక వాటిని తనకు అప్పగించాలని జయలలిత మేనకోడలు దీప కోర్టులో ఒక పిటీషన్ను దాఖలు చేశారు. దీంతో గతంలో జయలలిత కోరినట్లుగా ఆ ఏడుకిలోల నగలు దీపకు దక్కే అవకాశం ఉంది.