Rythu Bima & Rythu Bandhu Scam: రైతు బీమా డబ్బులు స్వాహా చేసిన వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. 20 మంది రైతుల పేరుతో.. కోటి రూపాయలు బీమా సొమ్మును ముఠా కాజేసినట్లు చెబుతున్నారు. రైతులు బతికున్నా.. చనిపోయినట్టు నకిలీ పత్రాలు తయారు చేసి.. బీమా సొమ్మును వ్యవసాయ అధికారి కొట్టేశాడు. రైతుబంధుకు సంబంధించిన.. నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి మరో కోటి రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు..అరెస్ట్ చేశారు. వీరిని మధ్యాహ్నం తర్వాత మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించనున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక విస్తరణ అధికారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరిని విచారణ చేస్తున్నారు.
గొర్రెల పంపిణి స్కామ్ మరువక ముందే.. మరో కుంభకోణం బయటకు రావడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. అన్నదాతలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. మరణించిన రైతులకు రైతు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున సహాయం చేసింది. అయితే ఈ పథకంలో లొసుగులను అవకాశంగా మార్చుకున్నారు అవినీతి అధికారులు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ. కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. వ్యవసాయశాఖలోని కొందరు అధికారులు ఈ కుంభకోణానికి తెరలేపారు. అన్నదాతల వివరాలను సేకరించి.. వారంతా మరణించినట్లు తప్పుడు పత్రాలను సృష్టించారు. వాటి ఆధారంగానే రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసి.. కోటి రూపాయల వరకూ పరిహారం నిధులను స్వాహా చేసినట్లు తేలింది.
Read More: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కలకలం.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్
ఇదంతా ఎల్ఐసీ ఫిర్యాదులో వెలుగులోకి వచ్చింది. రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఆ క్లైయిమ్ లపై చెల్లింపులకు ఎల్ఐసీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో కోటి రూపాయలకు పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఈ విషయంపై ముంబైలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో.. అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రైతుబంధు పొందాలంటే భూమి యజమాని పేరు ధరణిలో నమోదై ఉండటం సహా.. బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానమైై ఉండాలి. ఇన్ని నిబంధనలున్నా.. అలా ఎలా నిధులను దారి మళ్లించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.