Drugs in Radisson Hotel: హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కలకలం రేగింది. అర్థరాత్రి హోటల్ లో పార్టీ జరగగా.. ఆ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు పోలీసులు. పార్టీలో కొకైన్ సహా.. ఇతర మత్తు పదార్థాలు వాడినట్లు సమాచారం. బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు వివేకానంద్ తన స్నేహితులకు ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో పోలీసులు మంజీరామాల్ ఓనర్ కూడా అయిన వివేకానంద్, అతని స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాడిసన్ హోటల్లో స్నేహితులకు పార్టీ ఇచ్చిన యోగానంద్ కుమారుడు.. వారితో కలిసి కొకైన్, ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పార్టీలో ఎంత మంది పాల్గొన్నారు? వీరికి డ్రగ్స్ సప్లై చేసినదెవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హోటల్ కూడా యోగానంద్దేనని తెలుస్తోంది. మూడు రోజులుగా వివేకానంద్, అతని స్నేహితులు హోటల్లో పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి గజ్జల యోగానంద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయటమే గాక వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ పోటీచేసే ప్రయత్నాల్లో ఉన్నారు.