Road Accident In Kakinada: కాకినాడ, పత్తిపాడు హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివారల ప్రకారం.. పత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద నేషనల్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ అయింది.
రహదారి పక్కనే లారీని నిలిపివేసి ముగ్గురూ కలిసి టైరు మార్చే పనిలో పడ్డారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ మరమ్మతులు చేస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు అదే మార్గంలో అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తి.. అక్కడిక్కడే చనిపోయారు.
Read More: వారం వారం సర్వే.. తేడా వస్తే అభ్యర్థులను మార్చేస్తా.. చంద్రబాబు వార్నింగ్..
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పత్తిపాడు సీఐ శేఖర్ బాబు, ఎస్సై పవన్ కుమార్ మృతులను నక్కబొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవర్లు దాసరి కిషోర్, దాసరి సురేశ్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.