Telangana BJP MP Candidates : తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఆరుగుర పేర్లను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మళ్లీ ఛాన్స్ దక్కింది. సికింద్రాబాద్ టిక్కెట్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మళ్లీ టిక్కెట్ దక్కింది. ఆయన రెండోసారి సికింద్రాబాద్ నుంచి పోటీకి దిగుతున్నారు.
కరీంనగర్ సిటింగ్ ఎంపీ బండి సంజయ్ కు మళ్లీ బీజేపీ అధిష్టానం అవకాశం ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో బండి సంజయ్ తొలిసారిగా ఎంపీగా గెలిచారు. ఇప్పుడు రెండోసారి ఆయనే బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై గంగుల కమలాకర్ విజయం సాధించారు.
నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఎంపీ మళ్లీ దక్కింది. 2019లో అరవింద్ తొలిసారిగా ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు రెండోసారి బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు.
చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని బీజేపీ అధిష్టానం బరిలోకి దింపుతోంది. 2014 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ముచ్చట మూడోసారి మూడో పార్టీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల బరిలోకి దుగుతున్నారు.
భువనగిరి టిక్కెట్ ను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ అధిష్టానం ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి మూడోసారి ఆయన బరిలోకి దిగబోతున్నారు. 2014లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తొలిసారి ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి రెండో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ తరఫున బూర నర్స య్య గౌడ్ బరిలోకి దిగబోతున్నారు. ఖమ్మం బీజేపీ ఎంపీ టిక్కెట్ వెంకటేశ్వరరావుకు దక్కింది.