Chandrababu naidu news today(andhra pradesh election news): ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. తొలి జాబితా విడుదల చేసిన ఒక రోజులోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను హెచ్చరించారు. పనితీరు బాగుంటేనే అభ్యర్థులు పోటీకి దిగుతారని తెలిపారు. పని తీరు సరిగాలేని అభ్యర్థులను మార్చడానికి వెనుకాడనని స్పష్టం చేశారు.
శనివారం 94 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితా విడుదల చేశారు. వారితో ఆదివారం వీడియో కాన్ఫెరన్స్ నిర్వహించారు. వారం వారం అభ్యర్థుల పనితీరును పర్యవేక్షిస్తానని తెలిపారు. పోలింగ్ వరకు సర్వే చేయిస్తానని వెల్లడించారు. అభ్యర్థులపై వ్యతిరేకత ఉంటే వారిని మార్చేస్తానని హెచ్చరించారు. సీటు వచ్చేసిందని నిర్లక్ష్యంగా ఉంటే మరొకరికి ఛాన్స్ ఇస్తానని అభ్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడిందని చంద్రబాబు అన్నారు. రానున్న 40 రోజులు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో ప్రజలకు చెప్పాలని స్పష్టంచేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలను కలుపుకుని ఎన్నికల ప్రచారం పాల్గొనాలని టీడీపీ అభ్యర్థులకు నిర్దేశించారు.
5 కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయని వివరించారు. ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేశానన్నారు. విజయమే లక్ష్యంగా
టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు.
Read More: సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యదు.. 8 మందిపై కేసు నమోదు
ఎమ్మెల్యే అభ్యర్థుకు ప్రజల మద్దతు కూడా కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే కొత్త పద్దతిలో అభ్యర్థులను ఎంపిక చేశానని తెలిపారు. అసంతృప్తితో ఉన్న నాయకులను అవసరమైతే పదిసార్లైనా వెళ్లి కలవాలని అభ్యర్థులకు సూచించారు. తానే అభ్యర్థిననే గర్వంతో ఉండటం తగదన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని తటస్థ ఓటర్లకు వివరించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికపై ఎంతో కసరత్తు చేశామని చంద్రబాబు వెల్లడించారు. 1.3 కోట్ల మంది ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేశామన్నారు. సర్వేల తర్వాత అభ్యర్థుల ఎంపిక చేశానని తెలిపారు.
2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీ భవిష్యత్తుకు ఎంతో కీలమని చంద్రబాబు అన్నారు. ఒక్క సీటులోనూ పరాజయం చవిచూడకూడదన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకబోతోందని విమర్శించారు. అధికార పార్టీని ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఓటర్లతో ఓట్లు వేయించుకోవాల్సింది అభ్యర్థులదేనని స్పష్టంచేశారు. సీఎం వైఎస్ జగన్ సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు కానీ.. ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని విమర్శించారు.
జగన్ ఎన్నికల్లో విజయం కోసం తన పాలనపై విశ్వాసం పెట్టుకోలేదని.. దొంగ ఓట్లు, డబ్బును, అక్రమ మార్గాలను నమ్ముకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ కుట్రలు, కుతంత్రాలు ఊహించని విధంగా చేస్తారని విమర్శించారు. ఎలక్షన్స్ వరకు రోజూవారీ చేయాల్సిన కార్యక్రమాలపై అభ్యర్థులతో చంద్రబాబు చర్చించారు.