Ayodhya Ram Mandir Donations : అయోధ్యలో ఈ ఏడాది రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ తర్వాత కూడా.. రాములోరి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో.. ఆలయానికి రూ.25 కోట్ల విరాళాలు సమకూరినట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. జనవరి 22న రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగ్గా.. ఫిబ్రవరి 22 వరకూ ఆలయానికి బంగారం, వెండి, చెక్కులు, నగదు రూపాల్లో అక్షరాలా రూ. 25 కోట్లు సమకూరినట్లు తెలిపారు.
Read More : దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..
ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యాలయ ఇన్ ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. వివిధ రూపాల్లో వచ్చిన రూ.25 కోట్ల విరాళాలు హుండీల ద్వారా జమ అయినట్లు తెలిపారు. అయితే ఆన్ లైన్ చెల్లింపుల గురించి ఇంకా తమకు తెలియదన్నారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకూ 60 లక్షల మంది భక్తులు రామ్ లల్లా దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. రానున్న శ్రీరామనవమి పండుగ రోజుల్లో సుమారు 50 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, విరాళాలు మరింత పెరుగుతాయని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా వచ్చే విరాళాలను లెక్కించేందుకు SBI నాలుగు ఆటోమెటిక్ కౌంటింగ్ మెషీన్లను ఏర్పాటు చేసినట్లు గుప్తా వివరించారు. విరాళాలు ఇచ్చిన భక్తులకు రసీదులు జారీ చేసేందుకు డజన్ కు పైగా కంప్యూటరైజ్డ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.
కాగా.. రామ్ లల్లాకు విరాళాలు, బహుమతుల రూపేణా వచ్చిన బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను కరిగించే బాధ్యతను భారత ప్రభుత్వ మింట్ కు అప్పగించింది ట్రస్ట్. అలాగే ట్రస్ట్ కు – SBIకి మధ్య MOU కుదరడంతో.. దానిప్రకారం విరాళాలు, సమర్పణలు, చెక్కులు, డ్రాఫ్ట్ లు, నగదు సేకరణ పూర్తి బాధ్యతను SBI తీసుకుని బ్యాంకులో జమ చేస్తుంది. ప్రత్యేకంగా దీని కోసం SBI సిబ్బందిని కేటాయించింది.