గాజాలో పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గల్ప్ ఆఫ్ ఏడెన్లో అమెరికాకు చెందిన చమురు నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు. అయితే దానిని మధ్యలోనే కూల్చివేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) తెలిపింది.
హౌతీల నియంత్రణలో ఉన్న యెమెన్ నుంచి ఆ మిస్సైల్ దూసుకువచ్చిందని పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆరంభించిన నవంబర్ 19 నాటి నుంచి హౌతీలు డ్రోన్లు, మిస్సైళ్లతో వాణిజ్యనౌకలపై విరుచుకుపడుతూనే ఉన్నారు.
Read more: న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్టు మృతి
మరోవైపు యెమెన్లోని హౌతీలపై అమెరికా, బ్రిటన్ తాజాగా దాడులు చేశాయి.8 ప్రాంతాల్లో మొత్తం 18 లక్ష్యాలను నేలమట్టం చేశాయి. వీటిలో ఆయుధాగారం కూడా ఉంది. అటాక్ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, ఓ హెలికాప్టర్ ఆ ఆయుధాగారంలో ఉన్నట్టు తెలుస్తోంది.
హౌతీ రెబెల్స్ దాడులు ఆరంభమైన తర్వాత అమెరికా, బ్రిటన్ ప్రతి దాడులకు దిగడం ఇది నాలుగోసారి. ఈ నెలలో రెండో దాడి. ఇప్పటివరకు హౌతీలు వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకుని 45 సార్లు దాడులకు దిగారు.