Alexei Navalny’s body handed over to his mother: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ సంఘటన ప్రపంచ దేశాలను షాక్ కి గురిచేసింది. అయితే తాజాగా అలెక్సీ నావల్ని మృతిదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించారు. ఈ వియాన్ని ఆయన అనుచరుడొకరు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
నావల్ని మృతిదేహం అప్పగించినందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చిన వారికి కృతజ్ఙతలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆర్కిటిక్ ప్రాంతంలోని ఒక జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతిదేహాన్ని అక్కడే రహస్యంగా సమాధి చేయడానికి ఒప్పుకోవాల్సిందని ఆయన తల్లిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒత్తిడి తెస్తున్నారని నావల్ని భార్య ఆరోపించింది. పుతిన్ తన చర్యలతో క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారని ఓ వీడియోలో నావల్ని భార్య యూలియా విమర్శించింది.
నావల్ని మృతిదేహం ఇప్పటికే కుళ్లిపోవడం ఆరంభించినందున వెంటనే ఖననం చేయడానికి ఒప్పుకోవాలని ఆయన తల్లిని అధికారులు వేధిస్తున్నారని ఆమే మీడియాకి వెల్లడంచింది. తన భర్త నావల్నీని బ్రతికుండగానే కాకుండా చనిపోయిన తర్వాత కూడా చిత్రవధ చేస్తున్నారని, ఆయన మృతి దేహాన్ని అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నావల్ని మృతిదేహాన్ని వెంటనే అప్పగించాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కాసేపటికే మృతిదేహం అప్పగింత వెలుగుచూసింది. అంత్యక్రియలు జరగాల్సి ఉంది. నావల్ని మృతికి కారణం పుతిన్ కారకుడన్న ఆరోపణల్ని అధ్యక్ష భవనం ఖండించింది.