Hyderabad Metro 2.O : హైదరాబాద్ మెట్రో.. ఎందరో వేల ఉద్యోగుల, స్టూడెంట్ల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తోంది. గంటల తరబడి.. కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్ కష్టాలను తగ్గించి.. నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆర్టీసీ కంటే.. మెట్రోకే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. తాజాగా.. మెట్రో రెండోదశ పనులకు పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొదటి దశ మెట్రోకు అనుసంధానంగా.. మొత్తం 7 కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర కొత్తగా మెట్రో కారిడార్ లను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే నిర్వహించి.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రూపొందించి పనుల్లో నిమగ్నమయ్యారు. వీలైనంత త్వరగా మెట్రో రెండో దశ పనులను మొదలు పెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం.. త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది.
Read More : వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..
హైదరాబాద్ రెండో దశ మెట్రోలో.. నాగోల్ – శంషాబాద్ మార్గం కీలకం కానుంది. చాంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల్లో ఒక చోట సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని, అందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. మొత్తం 7 కారిడార్లలో అత్యంత పొడవైన కారిడార్ నాగోల్ – శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గం. దీని దూరం 21 కిలోమీటర్లు ఉంది.
మియాపూర్ – పటాన్ చెరు – 14 కిలోమీటర్లు, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ 8 కిలోమీటర్లు, రాయదుర్గం – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ 8 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట మరో 8 కిలోమీటర్ల మేర మెట్రోలను నిర్మించేందుకు డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటే నాగోల్ – శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో ఇన్నర్ రింగురోడ్డుపై ఉన్న చాంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల్లో ఇంటర్ చేంజ్ స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.