PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు గూగుల్ కు చెందిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ “జెమిని” ఇచ్చిన సమాధానం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గూగుల్ శనివారం స్పందించింది. సమకాలీన, రాజకీయ అంశాలక సంబంధించి తమ చాట్ బాట్ అన్ని సార్లు నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చని తెలిపింది.
ఏఐ టూల్ జెమిని మోదీపై ఏం సమాధానం చెప్పిందంటే.. ప్రధాని మోదీ ఫాసిస్టా..? అని ఓ నెటిజన్ ప్రశ్న అడిగారు. జెమిని ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి అడిగితే మాత్రం ఖచ్చితంగా , స్పష్టంగా చెప్పలేం అని సమాధానాన్ని దాటవేసింది. ఇది సోషల్ మీడియలో వైరల్ అవ్వడంతో గూగుల్ పక్షపాతంగా పని చేస్తోందంటూ నెట్టింట విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది ఐటీ చట్టం, క్రిమినల్ కోడ్ నిబంధనల ఉల్లంఘంచినట్లే అవుతుందని, దీనిపై చర్యలు తప్పవంటూ ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు.
అయితే ఈ క్రమంలోనే గూగుల్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. జెమిని ని మేము ఓ సృజనాత్మక టూల్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అయితే సమకాలీన, రాజకీయ అంశాల గురించి అడిగినప్పుడు ఈ టూల్ ప్రతిసారీ విశ్వసనీయమైన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చన్నారు. ఈ విషయంలో తమ ఏఐ ను మరింత ఖచ్చితత్వంతో పని చేసేలా అభివృద్ది చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని వివరణ ఇచ్చారు.
Read More: ఫేక్ ఐఫోన్ డెలివరీ.. కస్టమర్ ఆగ్రహం.. స్పందించిన అమెజాన్..
కాగా గూగుల్ ఇచ్చిన వివరణఫై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణాలతో చట్టాల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఖచ్చితత్వం లేని వేదికలు, అల్లారిథమ్ లపై తమ డిజిటల్ యూజర్లతో ప్రయోగాలు చేయకూడదన్నారు. యూజర్లకు డేటా భద్రత, విశ్వసనీయమైన సేవలు అందించడం మాధ్యమాల చట్టపరమైన బాధ్యతని పేర్కొన్నారు. ఇలాంటి కారణాలతో చట్టాల నుంచి మినహాయింపు పొందలేరన మంత్రి హెచ్చరించారు.