TS Govt will revive Nizam Sugar Factory: నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ఏర్పాటైన కమిటీకి శ్రీధర్బాబు నేతృత్వం వహిస్తున్నారు. కమిటీ సభ్యులతో కలిసి బోధన్ పట్టణంలోని సక్కర్నగర్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని శనివారం సందర్శించారు.
ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. త్వరలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఫ్యాక్టరీని తిరిగి అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, కార్మికుల కోసం ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం అని పేర్కొన్నారు.
ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోందని, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. ఫ్యాక్టరీలోని యంత్రాలు, డిస్టిలరీ యూనిట్, ఇతర పరికరాలను మంత్రితో పాటు కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను స్థానిక అధికారులు, నాయకులను అడిగి తెలుసుకున్నారు.
Read More: లాస్య నందిత యాక్సిడెంట్ ఎఫెక్స్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..
2015లో మూతపడిన ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కమిటీ సభ్యులు రైతులతో మమేకమై వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తే చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమిటీకి తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విధానాన్ని ప్రవేశపెడుతుందని, సామాజిక వ్యవస్థాపకత వృద్ధిని ఏకీకృతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు.