TDP Activists Protest: తొలి జాబితా ప్రకటించిన తర్వాత సంబరాల సంగతి అలా ఉంచితే.. టికెట్ రాని నేతలు తమ అసంతృప్తిని బాహటంగానే వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా పొత్తులో భాగంగా జనసేనకు తమ టికెట్లు వెళ్లడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పసుపు పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. తమ అసంతృప్తిని బయటపెడుతూ రాజీనామాలకు సైతం తెగబడుతున్నారు.
టికెట్ రాని నేతల్లో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. అలాగే నిన్న మొన్నటి వరకు పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు. అటు బండారు సత్యనారాయణకు కూడా మొండి చేయే మిగిలింది. ఇక విజయనగరంలో టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతోపాటు కిమిడి నాగార్జునకు తొలి జాబితాలో నిరాశే ఎదురైంది.
అంతే కాదు కళా వెంకట్రావును వ్యతిరేకించిన కొండ్రు మురళికి టికెట్ దక్కడం మరో విశేషం. అటు గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి టీడీపీ షాకిచ్చింది. దీంతో చంద్రబాబు తీరుపై అప్పలనాయుడి వర్గం భగ్గుమది. ఇప్పటికే గజపతినగరం టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి అప్పలనాయుడు రాజీనామా చేశారు.
ఇక తూర్పు గోదావరి జిల్లాలోనూ పలువురు టీడీపీ సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టేశారు. ముఖ్యంగా రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చేయి చూపించారు. మరోవైపు రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ – జనసేన మధ్య క్లారిటీ రాలేదు. దీంతో బుచ్చయ్య చౌదరి టికెట్ అంశం
ప్రస్తుతానికి క్రాస్ రోడ్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Read More: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల.. జిల్లాల వారిగా అభ్యర్థులు వీరే..
అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లకు చంద్రబాబు షాకిచ్చారు. ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్కు సీట్లు కేటాయించలేదు. తెనాలి సీటును జనసేన ఎగరేసుకుపోయింది. జేఎస్పీ తరఫున నాదెండ్ల మనోహర్ కు తెనాలి టికెట్ కేటాయించారు. ఇక పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, వెస్ట్ల్లో అభ్యర్ధులను ప్రకటించలేదు. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతకు మొండి చేయే దిక్కయింది. ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకులో పవన్ మాట ఇచ్చినప్పటికీ రామచంద్రరావుకు టికెట్ దక్కలేదు. ఇక తాడేపల్లి గూడెం, నర్సాపురం స్థానాల్లో టీడీపీ – జనసేన మధ్య సయోధ్య కుదరలేదు.
అటు తొలి జాబితా అనంతపురం టీడీపీలో చిచ్చు పెట్టింది. దీంతో జిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కల్యాణదుర్గంలో కాంట్రాక్టర్ సురేంద్ర బాబుకు టికెట్ కేటాయించారు. దీంతో చంద్రబాబు తీరుపై ఉన్నం హనుమంతురాయ చౌదరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి తమ నిరసన వ్యక్తం చేసింది హనుమంతురాయ చౌదరి వర్గం.