Jaanhavi Kandula Death Case: అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు ఫిబ్రవరి 22న వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఫిబ్రవరి 24న సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది.
‘జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం. తగిన పరిష్కారం కోసం జాహ్నవి మృతి కేసు గురించి స్థానిక అధికారులు, సియాటెల్ పోలీసుల వద్ద గట్టిగా లేవనెత్తాం. సమీక్ష కోసం ప్రస్తుతం ఈ కేసును సియాటెల్ అటార్నీ కార్యాలయానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నాం. ఈ విషయంలో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని సియాటెల్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ పోస్టు ద్వారా వెల్లడించారు.
Read More: నోరొవైరస్తో అమెరికన్ల బెంబేలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో డవేపై అభియోగాలు మోపడం లేదని పేర్కొంటూ.. కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం 2024 ఫిబ్రవరి 22న తీర్పునిచ్చింది. సీనియర్ అధికారులతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది.
మరోవైపు జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ చెప్పారు. చులకనగా మాట్లాడిన అధికారిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అతనిపై తుది విచారణ మార్చి 4న జరగనుందిని తెలిపారు.