HarishRao: తన ఫోన్ ట్యాప్ చేసున్నారనే అనుమానం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. అందుకు గవర్నర్ చెబుతున్న కారణం.. తుషార్ తనకు ఫోన్ చేశాడని, ఆ విషయం టీఆర్ఎస్ వాళ్లకు ఎలా తెలిసిందనేది డౌట్. అందుకే తన ఫోన్ కాల్స్ రహస్యంగా వింటున్నారనే అనుమానం. ఫాంహౌజ్ కేసులోకి రాజ్ భవన్ ను లాగాలని చూస్తున్నారంటూ విమర్శ. తీవ్ర కలకలం రేపిన తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మంత్రి హరీష్ రావు చెప్పిన సమాధానం మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ హరీష్ రావు ఏమన్నారంటే…
ఫాంహౌజ్ కేసులో ప్రస్తావనకు వచ్చిన తుషార్.. గతంలో కేరళలో రాహుల్ గాంధీపై పోటీ చేసిన బీజేపీ నాయకుడు అని.. కానీ, గవర్నర్ మాత్రం తన దగ్గర పని చేసిన తుషార్ గురించి మాట్లాడారని.. మంత్రి హరీష్ రావు అన్నారు. తాము వేరే తుషార్ గురించి మాట్లాడితే.. గవర్నర్ ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు. హరీశ్ కామెంట్లతో ఆ తుషార్, ఈ తుషార్ వేరువేరా? అనే డౌటనుమానం వ్యక్తం అవుతోంది.
ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్ట పగలు దొంగలు దొరికిపోవడంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ ముగ్గురు మధ్యవర్తులు ఎవరో తమకు తెలీదంటూ ఇన్నాళ్లూ బీజేపీ బుకాయించింది. ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపడంతో.. కేసు విచారణ ఆపాలని, సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కోర్టులో కేసులు వేసి ఆ పార్టీ అడ్డంగా బుక్కైందని అన్నారు.
సంబంధం లేని కేసులో బీజేపీ ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు? సిట్ను రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారు? విచారణ జరిగితే బీజేపీ బండారం బయటపడుతుందనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారన్నారు హరీశ్ రావు. కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలంటున్నారు.. తెలంగాణ పోలీసులపై బీజేపీకి నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.