AAP Congress Seat Deal: ఢిల్లీలోని ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య లోక్సభ ఎన్నికల కోసం సీట్ల పంపకాల ఒప్పందం శనివారం ఖరారైంది. ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతుందని కాంగ్రెస్ ఎంపీ ముకుల్ వాస్నిక్ ఢిల్లీలో ప్రకటించారు.
న్యూఢిల్లీ, సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీలో ఆప్ అభ్యర్థులు పోటీ చేయనుండగా, చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
అంతకుముందు, ఆప్ కాంగ్రెస్కు ఏడు లోక్సభ సీట్లలో ఒకదానిని మాత్రమే ఆఫర్ చేసింది. ఇది ఆప్-కాంగ్రెస్ మధ్య చర్చలను ప్రతిష్టంభనకు గురిచేసింది.
2014, 2019లో జరిగిన రెండు లోక్సభ ఎన్నికలలో, బీజేపీ దేశ రాజధానిలోని మొత్తం ఏడు స్థానాలను గెలుచుకుంది, ఓట్ల శాతం 50 శాతానికి మించిపోయింది.
హర్యానా (కురుక్షేత్ర)లో ఒక స్థానానికి, గుజరాత్లో (భరూచ్, భావ్నగర్) రెండు స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది. గోవాలో ఆప్ అభ్యర్థులు ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. గతంలో దక్షిణ గోవా నియోజకవర్గానికి పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించింది, అయితే వారు ఆ స్థానంలో పోటీ చేయడం లేదని శుక్రవారం ప్రకటించింది.
Read More: యూనిఫాం సివిల్ కోడ్ దిశగా అస్సాం.. ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం..
పంజాబ్, చండీగఢ్లోని మొత్తం 14 లోక్సభ స్థానాలకు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.
ఈ వారం ప్రారంభంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కూడా ఉత్తరప్రదేశ్లో సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుండగా, మిగిలిన 63 స్థానాల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (SP), ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటారు.
మహారాష్ట్రలో ఇండియా బ్లాక్ సీట్ల పంపకంపై కూడా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబీటీ), ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, సీట్లపై త్వరలో తుది నిర్ణయం ప్రకటిస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం తెలిపారు.
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు, కాంగ్రెస్, టీఎంసీ మధ్య క్రియాశీల చర్చలు జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.