Blood Clotting Due To Covid Vaccine: కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయటపడేసే విధంగా శాస్త్రవేత్తలు ప్రాతిపదికన టీకాలను అభివృద్ధి చేశారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి. అయితే తాజాగా ఈ టీకాల వల్లే గుండె, మెదడు సంబంధిత వ్యాధులు చోటుచేసుకుంటున్నాయనే వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ ప్రచారాన్ని బలోపేతం చేయడానికి, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన అధ్యయనం ప్రకారం.. గుండె, మెదడు, రక్త సంబంధిత వ్యాధుల పెరుగుదలకు కరోనా వ్యాక్సిన్లు కారణమని వెల్లడించింది. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
Read More: గంజాయి వినియోగం చట్టబద్ధం.. జర్మనీలో కొత్త చట్టం
డబ్ల్యూహెచ్ఓ (WHO) పరిశోధనా విభాగం అయిన గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ నుండి శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ఫలితాలు సైన్స్ జర్నల్ వ్యాక్సిన్లో నివేదించబడ్డాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని పరిశోధకులు తెలిపారు. భారత్ మినహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ స్కాట్లాండ్ వంటి దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న 9.9 కోట్ల మందిపై ఈ అధ్యయనం జరిగింది.
కొన్ని రకాల ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె, కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. దీనితోపాటు గులియన్ బారె సిండ్రోమ్, పెర్కిర్డిటిస్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని చెప్పారు.
మోడెర్నా ఫైజర్-బయోఎన్టెక్కు చెందిన ఎంఆర్ఎన్ఏ (mRNA) టీకాల మొదటి దశలో మూడు డోస్లు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. మోడెర్నా రెండో డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు ఎక్కువగా పెరిగాయని పరిశోధకులు పేర్కొన్నారు.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్న వారిలో పెరికార్డిటిస్ అనే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 6.9 శాతం ఉందని, మోడెర్నా టీకా నాలుగో డోసు తీసుకున్న వారిలో ఈ ముప్పు 2.6 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే వ్యాధిబారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని, రోగనిరోధక వ్యవస్థ, నరాలపై దాడి చేసే గులియన్ బారె సిండ్రోమ్ను కూడా గుర్తించినట్లు తెలిపారు.
అయితే, కోవిడ్-19 టీకాలు వేసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య సంస్థ పరిశోధకులు తేల్చిచెప్పారు. కాబట్టి కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి కోవిడ్-19 టీకా తీసుకోవడం ఇప్పటికీ సురక్షితమైన మార్గమని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇక, కరోనా బారినపడిన వారిలో చాలా మంది ఏడాదిలోనే కోలుకున్నారు. మరికొందరికి ఊపిరితుత్తులు శాశ్వతంగా దెబ్బతిన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ కో-డైరెక్టర్ ప్రొపెసర్ జిమ్ బుట్టేరీ మాట్లాడుతూ.. ఈ అధ్యయనం రెండో దశ పూర్తి చేయడం ద్వారా దుష్ప్రభావాన్ని స్వతంత్రంగా నిర్ధారించడానికి పరిశోధకులను ఎంతో ప్రేరేపించిందని అన్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ని పొందిన 6.8 మిలియన్ల ఆస్ట్రేలియన్ల ప్రత్యేక డేటాను విశ్లేషించారని తెలిపారు.
ఎన్సెఫలో మైలిటిస్ను అరుదైన దుష్ప్రభావంగా నిర్ధారించడమే కాకుండా పెద్ద మొత్తంలో ట్రాన్స్వెర్స్ మైలిటిస్ బారినపడ్డట్లు గుర్తించామని వెల్లడించారు. ఎన్సెఫలో మైలిటీస్ ప్రతి మిలియన్ డోస్లకు 0.78, ట్రాన్స్వర్స్ మైలిటిస్ 1.82 కేసులు నమోదైనట్లు గుర్తించారని జిమ్ బుట్టేరీ తెలిపారు.