Benjamin Netanyahu: హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తోన్నటువంటి యుద్ధం ఐదు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఒక వేళ ఈ యుద్ధం ముగిస్తే.. పాలస్తీనా భూభాగంలో పాలనా పరిస్థితులకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ ప్లాన్ రూపొందించారు. వెస్ట్ బ్యాంక్, గాజాతో సహా జోర్డాన్ పశ్చిమభాగంలో భద్రతా నియంత్రణ మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంటుందని ప్రతిపాదించింది. దీనిని ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ముందు ఆమోదానికి ఉంచారు.
యుద్ధం తర్వాత చేపట్టాల్సిన దీర్ఘకాలిక వ్యూహాలను సిద్ధం చేసిన నెతన్యాహు.. పాలస్తీనాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించడాన్ని తోసిపుచ్చారు. పాలస్తీనియన్లతో పరిష్కారం అనేది రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే సాధ్యపడుతుందని నెతన్యాహు చెప్పారు. అయితే, పాలస్తీనియన్ల వైపు ఎవరు ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.
గాజా-ఈజిప్టు సరిహద్దులో ఇజ్రాయెల్ ఉనికి ఉంటుందని నెతన్యాహు ప్రతిపాదించారు. రఫా క్రాసింగ్తోపాటు స్థానికంగా స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈజిప్టు, అమెరికాలకు సహకరిస్తామని వెల్లడించారు. గాజాలో శాంతిభద్రతలను కాపాడుతూ హమాస్ పాలనను భర్తీ చేసేందుకు స్థానిక ప్రతినిధులతో కలిసి పనిచేస్తామన్నారు. అయితే, ఉగ్రవాద దేశం, గ్రూపులతో సంబంధం లేనివారితోనే కలిసి నడుస్తామని ఆయన పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని పాలస్తీనా శరణార్థి ఏజెన్సీని మూసివేయాలని నేతన్యాహు అన్నారు. దాని స్థానంలో ఇతర అంతర్జాతీయ సహాయ బృందాలను కొనసాగించాలని పేర్కొన్నారు. గాజా నుంచి సైనికులను వెనక్కి రప్పించే (నిస్సైనికీకరణ) అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. ఇందుకు సంబంధించి మధ్యకాలిక లక్ష్యాలను నిర్దేశించారు. అయితే, అవి ఎప్పటినుంచి మొదలవుతాయనే విషయాన్ని వెల్లడించలేదు.