Huge Traffic Jam At Medaram Jatara 2024: మేడారం మహాజాతరకు భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క- సారలమ్మ గద్దెలపైకి చేరడంతో జాతరకు భారీగా జనాలు తరలివచ్చారు. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దారులన్నీ మేడారిని అన్నట్లుగా.. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం- తాడ్వాయి మధ్య సుమారు 15 కిలోమీటర్ల మేర, వస్రా నుంచి గోవిందరావుపేట వరకు ఐదు కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మేడారం నుంచి వచ్చి పోయే దారులు గుండా వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు , భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుగు ప్రయాణంలో నార్లపూర్ నుంచి బయ్యక్కపేట, భూపాలపల్లి మండలం దూదేకులపల్లి నుంచి గొల్లబుద్దారం, రాంపూర్ మీదుగా కమలాపూర్ క్రాస్ రోడ్డ వరకు వన్ వే రహదారిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాహనాలు కాటారం మీదుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
గుండెపోటుతో ఇద్దరు భక్తుల మృతి..
మేడారం జాతరలో గుండెపోటుతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. వారికి తీవ్ర ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉచిత వైద్య శిబిరానికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతులు పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి(68), విజయవాడకు చెందిన సాంబయ్య(40)గా పోలీసులు గుర్తించారు.