.
CM Revanth Reddy Visited Medaram Jatara 2024: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి వెళ్లిన సీఎం జాతర పరిసరాలను పరిశీలించారు.
మేడారంలో వనదేవతకు పూజలు చేసి అమ్మవార్లకు సాంప్రదాయపద్దతిలో నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నాన్నారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుసంబంధం ఉందన్నారు.
ఎన్నికల సందర్భంలో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నేను ఇక్కడి నుంచే ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించామన్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లు మంజూరు చేశామని సీఎం అన్నారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడు ఎవరో ఒకరు నిలబడతారన్నారు. సమ్మక్క, సారలమ్మ నుంచి స్ఫూర్తి పొంది గత ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేశామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేసేందుకు ముహూర్తం ఖరారైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఫిబ్రవరి 27న ప్రారంభిస్తామన్నారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని సీఎం తెలిపారు.
Read More: లాస్య నందిత పోస్ట్ మార్టం రిపోర్టులో షాకింగ్ వివరాలు..
మేడారం జాతరపై కేంద్రం వివక్ష చూపడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా పత్రికల్లో చూశానన్నారు.. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోందన్నారు. దాని కోసం రూ.వందల కోట్లు విడుదల చేసిందన్నారు. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు మాత్రం కేవలం రూ.3 కోట్లు కేటాయించిందని సీఎం మండిపడ్డారు.
తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనేందుకు ఈ జాతర పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం జాతరకు ప్రధాని మోదీ, అమిత్ షాను ఆహ్వానిస్తున్నామన్నారు. జాతరకు వచ్చి మోదీ, అమిత్ షా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవాలన్నారు. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని మోదీ, అమిత్ షా చెప్పారన్నారు. ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ వచ్చి దర్శించుకోవాలని సీఎం అన్నారు. వారిని అధికారిక హోదాలో స్వాగతం పలికే బాధ్యతను తనతో పాటు గా మంత్రివర్గం చూసుకుంటామని తెలిపారు
మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కిషన్ రెడ్డి ఆదివాసీలను అవమానించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత సీఎం కేసీఆర్ మేడారం సందర్శించుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారన్నారు. భవిష్యత్తులో బీజేపీకి కూడా అదే పరిస్థితి వస్తుందని కిషన్ రెడ్డికి చెబుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదన్నారు. దక్షిణ భారత్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉందన్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, శ్రీనివాసరెడ్డి, కొండా సురేష్, సీఎస్ శాంతికుమారిలు ఉన్నారు.