CM Jagan in Ongole Meeting: పేదలకోసం పెత్తందారులతో ఎన్నో పోరాటాలు చేశామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఎన్.అగ్రహారంలో 25 వేల మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. అలాగే.. ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.350 కోట్ల విలువైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నేటి వరకూ.. 58 నెలల కాలంలో ప్రతీ అడుగు పేదల మంచికోసమే వేశామన్నారు. ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఇంటింటికీ ప్రభుత్వ సేవల్ని అందిస్తున్నామన్నారు.
పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండకూడదన్న ఉద్దేశంతోనే.. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు హక్కుల్ని కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఏపీలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి.. పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామన్నారు.
పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టామని తెలిపారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో పుస్తకాలను అందజేయడంతో పాటు.. ప్రతి స్కూల్ లో మౌలిక వసతుల్ని కల్పించామని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేశామని వివరించారు.
వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్ వివరించారు. పేదలకు కార్పొరేట్ వైద్యంతో పాటు.. చికిత్స ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని రూ.25 లక్షలకు పెంచి, ప్రొసీజర్స్ ను 3300కు పెంచామన్నారు.
పేదలకు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెళ్లకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని, ఈ రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసే అవకాశం భవిష్యత్ లో ఎవరికీ ఉండదన్నారు. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఉండేవన్నసీఎం.. వైసీపీ హయాంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామన్నారు. పేదల ఆత్మగౌరవం విషయంలో.. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు.
చంద్రబాబు లాంటివారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయని.. మనం సిద్ధం అంటుంటే.. నారా భువనేశ్వరి సిద్ధంగా లేమంటున్నారని సీఎం జగన్ విమర్శించారు. ఇక చంద్రబాబుకు కుప్పం ప్రజలే బైబై చెబుతున్నారన్నారు. ఐదేళ్ల పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందని మీరు నమ్మితే.. మీ బిడ్డకు తోడుగా నిలబడాలని సీఎం జగన్ ప్రజలను కోరారు.