Maharashtra Ex CM Manohar Joshi Dead: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు. రెండ్రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన ముంబైలోని పి.డి.హందుజా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రమే మనోహర్ జోషి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ రోజు మధ్యాహ్నం ముంబైలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. కాగా.. గతేడాది మే నెలలోనూ ఆయన మెదడులో తీవ్ర రక్తస్రావం కారణంగా ఆస్పత్రిలో చేరారు.
జోషి.. 1937 డిసెంబర్ 2న నాంద్వీలో జన్మించారు. ఆయన చదువంతా ముంబైలోనే సాగింది. చదువు పూర్తయ్యాక ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్ జోషి.. 1967లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ గానూ పనిచేశారు. 1967-77 మధ్య ముంబై మేయర్ గా పనిచేసిన ఆయన.. 1972లో మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసి.. 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
Read More: సాయన్న కుమార్తె, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
శివసేన పార్టీలో చేరి.. కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన నుంచే ముంబై నార్త్-సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత.. 2002-2004 మధ్య ప్రధాని వాజ్ పేయి హయాంలో లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. భార్య అనఘ మనోహర్ జోషి 2020లో మరణించింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.