CM Revanth Reddy on Gas Cylinder: ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించినటువంటి గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలు చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27 లేదా 29న ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేబినేట్ సభ్ కమిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా సబ్సిడీలు ఎలా అందించాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లులు ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లబ్దిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చే విధంగా అనువైన విధానాన్ని అనుసరించాలన్నారు. సబ్సిడీని ఖాతాకు బదిలీ చేయాలా? ఏజెన్సీలకు చెల్లించాలా? వంటి అనుమానాలు, అపోహాలకు తావు లేకుండా పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లలు జారీ చేయాలన్నారు.
Read More: హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు.. డాక్టర్ ఓవర్ స్పీడ్..
తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్ కనెక్షన్ నెంబరు తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయినవారు ఉంటే.. వారికి సవరించే అవకాశం ఇవ్వాలన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహశిల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతరం ప్రక్రియగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.